Nara Lokesh: రక్తం పీల్చేంత అవినీతికి మీ జలగన్న పెట్టిందిపేరు: నారా లోకేశ్

  • వైసీపీ నేతలపై లోకేశ్ ఫైర్
  • మీ నాయకుడిలా ప్రజల రక్తం పీల్చే దుస్థితిలో లేనంటూ వ్యాఖ్యలు
  • ఏపీ ఫైబర్ గ్రిడ్ ను అందరూ మెచ్చుకున్నారంటూ ట్వీట్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏపీ అధికార పక్షంపై మరోసారి ధ్వజమెత్తారు. రక్తం పీల్చేంత అవినీతికి మీ జలగన్న పెట్టింది పేరు అంటూ వైసీపీ నేతలకు చురక అంటించారు. అలాంటి వ్యక్తిని పక్కన ఉంచుకుని మాపై ఆరోపణలు చేస్తే జనం నవ్వుతారు అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు. 'ఆధారాల్లేకుండా ఆరోపణలతో బతికేస్తాం అనుకుంటే మీ ఇష్టం, కానీ మీ నాయకుడిలా జనాల రక్తం పీల్చే దుస్థితిలో నేను లేను' అంటూ వ్యాఖ్యానించారు.

అప్పట్లో తాము ఫైబర్ గ్రిడ్ తీసుకువస్తే రెండోరోజే కేబుల్ వైర్లు కోసేసి, కోర్టుల్లో కేసులు వేసి ఆపేయించాలని ప్రయత్నించారని లోకేశ్ ఆరోపించారు. 'ఆనాడు టీడీపీకి ప్రజల్లో మంచి పేరు వస్తుందన్న అక్కసుతో అలాంటి చర్యలకు పాల్పడి ఉండొచ్చేమో కానీ, ఇప్పుడు అధికార పక్షంలో ఉండి కూడా అదే తరహాలో ఆరోపణలు చేస్తుంటే ప్రజలకు మీపై రోత పుడుతోంది బుగ్గన గారూ' అంటూ విమర్శించారు.

ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, ఏపీ ఫైబర్ గ్రిడ్ వ్యవస్థను విజయవంతం చేసిన తీరుపై రాష్ట్రపతితో పాటు, వివిధ రాష్ట్రాల సీఎంలు కూడా అభినందించారని లోకేశ్ పేర్కొన్నారు. అప్పటి అంచనాల ప్రకారం రూ.5000 కోట్లు ఖర్చయ్యే ప్రాజక్టును తాము రూ.350 కోట్లతోనే సాకారం చేశామని, అలాంటి ప్రాజక్టుపై అవినీతి అంటూ సొల్లు కబుర్లు చెప్పకుండా, ఆధారాలుంటే నిరూపించాలని నారా లోకేశ్ సవాల్ విసిరారు.

More Telugu News