Andhra Pradesh: తెలంగాణకు ‘బందరు పోర్టు’.. ఘాటుగా స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు!

  • ఈ ప్రయత్నాలు ఇంకా సాగుతున్నాయి
  • పోర్టులపై సొంత నిర్ణయాలు తీసుకోలేరు
  • ఇష్టానుసారం ధారాదత్తం చేస్తానంటే టీడీపీ ఒప్పుకోదు

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బందరు పోర్టును తెలంగాణకు అప్పగించే ప్రయత్నం చేస్తోందని టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆరోపించారు. ఈ ప్రయత్నాలు ఇంకా తెరవెనుక జరుగుతూనే ఉన్నాయని వ్యాఖ్యానించారు. గత నెల 28న ఆర్టీ-62 పేరుతో ఇందుకోసం ఓ రహస్య జీవోను జారీచేశారనీ, ఆ తర్వాత మాటమార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో అసెంబ్లీలోనూ వైసీపీ ప్రభుత్వం బుకాయించిందని విమర్శించారు.

నౌకాశ్రయాలు అన్నవి సీమాంధ్రకు ప్రకృతి ఇచ్చిన వరమని చంద్రబాబు తెలిపారు. ఇలాంటి పోర్టులపై సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం ఎవ్వరికీ లేదని స్పష్టం చేశారు. మీ(కేసీఆర్-జగన్) స్నేహాలకు, సొంత లాలూచీలకు రాష్ట్ర ఆస్తులను ధారాదత్తం చేస్తామంటే టీడీపీ సహించబోదని హెచ్చరించారు.

మచిలీపట్నం డీప్ వాటర్ పోర్టు, దాని ఆధారంగా పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం కృషి చేసిందని చంద్రబాబు గుర్తుచేశారు. ఇందుకోసం మచిలీపట్నం పట్టాణాభివృద్ధి సంస్థను 2017, మార్చిలో ఏర్పాటు చేశామన్నారు. ఈ మేరకు చంద్రబాబు వరుస ట్వీట్లు చేశారు.

More Telugu News