Andhra Pradesh: కొద్దిరోజులు ఆగు చిట్టినాయుడు.. అమరావతి కలల రాజధానో, కులపు రాజధానో తెలుస్తుంది!: విజయసాయిరెడ్డి

  • నారా లోకేశ్ పై విజయసాయిరెడ్డి ఘాటు విమర్శలు
  • అమాయక రైతుల భూములను లాగేసుకున్నారని ఆగ్రహం
  • నిప్పో, తప్పో ప్రజలే తేల్చుతారని స్పష్టీకరణ

ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని దెబ్బతీయడానికి ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని వైసీపీ నేతలు బుదర చల్లుతున్నారంటూ టీడీపీ నేత నారా లోకేశ్ నిన్న విమర్శించిన సంగతి తెలిసిందే. తాజాగా లోకేశ్ విమర్శలపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు.

నారా లోకేశ్ మరికొన్ని రోజులు ఆగాలనీ, అప్పుడే అమరావతి కలల రాజధానో లేక కులపు రాజధానో తెలుస్తుందని వ్యాఖ్యానించారు. లోకేశ్, ఆయన బినామీలన్నీ లాక్కున్న అమాయక రైతుల భూముల స్టోరీలు సీరియల్ గా బయటకు రాబోతున్నాయని చెప్పారు.

ఈరోజు ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి స్పందిస్తూ..‘కొద్ది రోజులాగు చిట్టి నాయుడూ? అమరావతి కలల రాజధానో, కులపు రాజధానో తెలుస్తుంది. ఇన్‌సైడర్ ట్రేడింగుతో అమాయక రైతుల పొట్టకొట్టి మీరూ, మీ బినామీలు లాగేసుకున్న వేల ఎకరాల స్టోరీలన్నీ సీరియల్‌గా బయటకొస్తాయి. మీరు నిప్పులో తుప్పులో ప్రజలే చెబుతారు. కాండ్రించి ఉమ్ముతారు’అని దుయ్యబట్టారు.

More Telugu News