Kuwait: మహిళను చిత్రహింసలు పెట్టిన పాకిస్థానీ.. రక్షించిన బాలీవుడ్ నటుడు

  • రూ.30 వేలు జీతం ఇప్పిస్తానని మోసం
  • కువైట్ తీసుకెళ్లి పాకిస్థానీకి అమ్మేసిన ఏజెంట్
  • వీణాను చిత్రహింసలకు గురి చేసిన పాకిస్థానీ

నిరుపేద మహిళ అవసరాన్ని ఆసరాగా చేసుకుని ఓ వ్యక్తి కువైట్ తీసుకెళ్లి, అక్కడ ఓ పాకిస్థానీకి అమ్మేస్తే, బాలీవుడ్ నటుడు, గురుదాస్‌పూర్ ఎంపీ సన్నీదేవోల్ ఆమెను రక్షించి ఆ మహిళ కుటుంబ ఆనందానికి కారణమయ్యారు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌కు చెందిన వీణాబేడీని ఓ ట్రావెల్ ఏజెంట్ రూ.30 వేలు జీతం ఇప్పిస్తానని నమ్మించి కువైట్ తీసుకెళ్లాడు.

అక్కడ ఓ పాకిస్థానీకి అమ్మేశాడు. అతను వీణాను చిత్రహింసలకు గురి చేశాడు. విషయం తెలుసుకున్న బాధితురాలి కుటుంబ సభ్యులు విషయాన్ని సన్నీకి తెలియజేసి కాపాడాలని అర్థించారు. వెంటనే స్పందించిన ఆయన విదేశాంగ మంత్రిత్వశాఖ, జిల్లా ఉన్నతాధికారులు, ఎన్జీవోల సాయంతో ఆమెను కాపాడారు. దీంతో వీణ శుక్రవారం స్వస్థలానికి చేరుకుంది. దీంతో కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

More Telugu News