Gujarat: హిందూ యువతి-ముస్లిం యువకుడి ప్రేమ.. అబ్బాయిని కొట్టి చంపిన యువతి బంధువులు!

  • గుజరాత్ లోని బోరిద్ర ప్రాంతంలో ఘటన
  • గిరిజన యువతిని ప్రేమించిన ఫయాజ్
  • ఫోన్ చేసి రప్పించి దాడిచేసిన కుటుంబీకులు

దేశవ్యాప్తంగా మూకహత్యలపై తీవ్రమైన చర్చ నడుస్తున్న వేళ దారుణ ఘటన చోటుచేసుకుంది. హిందూ మతానికి చెందిన ప్రియురాలని కలుసుకునేందుకు వచ్చిన ఓ ముస్లిం యువకుడిని ఆమె బంధువులు కొట్టి చంపారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, నిందితులను అరెస్ట్ చేశారు. ఈ నెల 24న చోటుచేసుకున్న ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుజరాత్ కు చెందిన ఫయాజ్(17) అనే యువకుడు మరో గిరిజన యువతిని ప్రేమిస్తున్నాడు.

అయితే ఈ విషయం తెలుసుకున్న యువతి తరఫు బంధువులు ఆమె చేత ఫయాజ్ కు ఫోన్ చేసి బోరిద్ర ప్రాంతానికి రప్పించారు. అక్కడకు వెళ్లగానే కర్రలు, రాడ్లతో విచక్షణారహితంగా దాడిచేశారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ ఫయాజ్ స్పృహ కోల్పోయాడు. కుమారుడిపై దాడి విషయం ఆలస్యంగా తెలుసుకున్న ఫయాజ్ తండ్రి ఖురేషీ అక్కడకు వెళ్లగా, అప్పటికే ఫయాజ్ విగతజీవిగా కనిపించాడు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగతావారి కోసం గాలింపును ముమ్మరం చేశారు. మూకహత్యల నిరోధానికి చర్యలు తీసుకోవాలంటూ 49 మంది సినీ, క్రీడా,రాజకీయ ప్రముఖులు ప్రధాని మోదీకి లేఖ రాసిన వారం రోజుల్లోపే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

More Telugu News