Andhra Pradesh: సినిమావాళ్లను నమ్మి ఓట్లేయవద్దు.. ఏపీ ప్రజలకు నటుడు, వైసీపీ నేత పృథ్వీ రిక్వెస్ట్!

  • ఎస్వీబీసీ చైర్మన్ కావడం పూర్వజన్మ సుకృతం
  • భక్తుల్లోకి మరింతగా ఛానల్ ను తీసుకెళతా
  • నేను వైసీపీ హార్డ్ కోర్ టెర్రరిస్టును

శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్(ఎస్వీబీసీ) చైర్మన్ పదవి తనకు రావడం నిజంగా పూర్వజన్మ సుకృతమని ప్రముఖ నటుడు, కమెడియన్ పృథ్వీ తెలిపారు. వెంకటేశ్వరస్వామే తనను ఇక్కడకు పిలిపించుకున్నారని వ్యాఖ్యానించారు. తానేంటో మాటల్లో చెప్పనని, చేతల్లో చేసి చూపిస్తానని చెప్పారు. ఎస్వీబీసీ ఛానల్ ను భక్తుల్లోకి మరింత తీసుకెళ్లేలా చర్యలు తీసుకుంటానన్నారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో తాను పోటీ పడననీ, తన స్టైల్ లో పనిచేసుకుంటూ పోతానని చెప్పారు.

సినిమావాళ్లను నమ్మి ఓటేయవద్దనీ, అలా నమ్మే పరిస్థితులు ఎన్టీఆర్, ఎమ్జీఆర్, జయలలితతోనే ముగిశాయని పృథ్వీ స్పష్టం చేశారు. వైసీపీలో తాను, విశాఖకు చెందిన జోగి నాయుడు 2013 నుంచే ఉన్నామని ఆయన తెలిపారు. వైఎస్ విజయమ్మ 2014లో విశాఖపట్నంలో పోటీ చేసినప్పుడు తాము అక్కడ పార్టీకోసం అవిశ్రాంతంగా సైనికుల్లా పనిచేశామని చెప్పారు. తాను హార్డ్ కోర్ వైసీపీ టెర్రరిస్టునని పృథ్వీ అన్నారు. సినిమా వాళ్లను నమ్మి ఓట్లేయవద్దని ప్రజలకు పృథ్వీ మరోసారి విజ్ఞప్తి చేశారు.

More Telugu News