East Godavari District: జషిత్ చాలా తెలివైనవాడు... కిడ్నాపర్లను గుర్తుపడతాడు కూడా: ఎస్పీ నయీమ్

  • కిడ్నాపైన తరువాత నిబ్బరంగా ఉన్న జషిత్
  • కిడ్నాపర్లలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు
  • త్వరలోనే పట్టుకుంటామన్న నయీమ్ హస్మి

మూడు రోజుల క్రితం తూర్పు గోదావరి జిల్లా మండపేటలోని తన నివాసం నుంచి కిడ్నాపైన జషిత్, చాలా తెలివైనవాడు, ధైర్యవంతుడని జిల్లా ఎస్మీ నయీమ్ హస్మి వ్యాఖ్యానించారు. మూడు రోజుల పాటు తెలియనివారితో ఉన్నా, జషిత్ భయపడలేదని ఎస్పీ తెలిపారు. గత రాత్రి ఒంటిగంట సమయంలో కిడ్నాపర్లు జషిత్ ను వదిలి వెళ్లారని, ఆపై ఉదయం వరకూ ఏసు అనే యువకుడు బాబును కాపాడారని చెప్పారు. బాబును మరో ప్రాంతం నుంచి తీసుకువచ్చి, ఇటుకబట్టీ వద్ద వదిలేసి వుంటారని అనుకుంటున్నామని తెలిపారు.

కిడ్నాపర్లను మరోసారి చూస్తే గుర్తు పడతానని జషిత్ చెబుతున్నాడని, అతను చెప్పినట్టుగా కిడ్నాపర్లలో రాజు అనే వ్యక్తి పేరు సరైనదేనా? అని పరిశీలిస్తున్నామని చెప్పారు. ఇద్దరు మహిళలను కూడా తాను చూసినట్టు జషిత్ చెప్పాడని, వారు ఎవరన్న విషయాన్ని గుర్తిస్తామని, కేసులో తీవ్రత దృష్ట్యా, బాలుడి ప్రాణాలకు ఆపద రాకూడదని, ఇప్పటివరకూ నిదానంగా ఇన్వెస్టిగేషన్ సాగించామని, ఇకపై వేగవంతం చేసి, నిందితులను పట్టుకుంటామని తెలిపారు. బాలుడిని వదిలి వెళ్లిన ప్రాంతం క్రికెట్ బెట్టింగ్ లకు ఎంతో పేరున్న ప్రాంతమని, పలువురు బుకీలు ఇక్కడ ఉంటారని చెప్పిన ఎస్పీ, కిడ్నాప్ వెనుక బెట్టింగ్ కోణం ఏమైనా ఉందా? అన్న విషయంపైనా విచారిస్తున్నామన్నారు.

More Telugu News