Chandrababu: ‘ఖబడ్దార్..చంద్రబాబు’ అంటూ వైసీపీ సభ్యుడు కోటంరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

  • ‘మీ ఎమ్మెల్యేలను అదుపులో పెట్టుకో’
  • మాట్లాడే అవకాశమిస్తే దుర్వినియోగం చేస్తున్నారు
  • జగన్ పాలనపై గవర్నర్ ప్రశంసలకు ఓర్వలేకపోతున్నారు

ఏపీలో సీఎం జగన్ పాలనపై గవర్నర్ నరసింహన్ ప్రశంసలు కురిపించడాన్ని చంద్రబాబునాయుడు ఓర్చుకోలేకపోతున్నారని వైసీపీ సభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఏపీ శాసనసభలో ఈరోజు పెన్షన్ల అంశంపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడీవేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా కోటంరెడ్డి మాట్లాడుతూ, జగన్ కు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేకనే టీడీపీ కుట్రలు చేస్తోందని, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.

‘ఖబడ్డార్, చంద్రబాబునాయుడు’ అంటూ రెచ్చిపోయిన శ్రీధర్ రెడ్డి, ‘మీ ఎమ్మెల్యేలను అదుపులో పెట్టుకో’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న తమకు శాసన సభా సమావేశాలు జరుగుతున్న సమయంలో ఎంత వేడుకున్నా మాట్లాడే అవకాశం దక్కేది కాదనీ, బతిమలాడుకోవాల్సిన దుస్థితి ఉండేదని అన్నారు. కానీ, తమ ప్రభుత్వం ప్రతిపక్షాన్ని గౌరవించి మాట్లాడే అవకాశమిస్తే దుర్వినియోగం చేస్తున్నారని కోటంరెడ్డి విమర్శించారు. టీడీపీ సభ్యులు తమ ప్రవర్తనతో ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావద్దని సూచించారు.

స‌భ‌లో ఉన్న ప‌రిస్థితి చూస్తే చాలా బాధ‌గా ఉందని, సంతోషంగానూ ఉందని అన్నారు. సంతోషం దేనికంటే గ‌తంలో ఎప్పుడూ లేనివిధంగా ప్ర‌తిప‌క్షానికి అవకాశం కల్పిస్తూ ప్ర‌జాస్వామ్యానికి కొత్త అర్థం చెబుతున్నామన్నారు. ఐదేళ్లు ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేలుగా ఉన్న‌ప్పుడు తమకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదని.. అధ్య‌క్షా... మైకు అంటూ అరవాల్సి వచ్చేదని ఆయన అన్నారు.

More Telugu News