Biggboss: తొలి రోజే హౌస్ మేట్స్ మధ్య కిరికిరి పెట్టిన బిగ్ బాస్!

  • హాట్ హాట్ గా సాగిన తొలిరోజు
  • అప్పుడే ఆరుగురు నామినేషన్
  • ఒకరికి తప్పించుకునే చాన్స్ ఇచ్చిన బిగ్ బాస్

టాలీవుడ్ రియాల్టీ షో బిగ్‌ బాస్‌ మూడో సీజన్‌ తొలి రోజే కంటెస్టెంట్స్ మధ్య ఫిట్టింగ్ పెట్టాడు బిగ్ బాస్. ప్రశ్నలడిగే టాస్క్ ను హౌస్ లోకి ఫస్ట్ ఎంట్రీ ఇచ్చిన రవికృష్ణ, శివ జ్యోతి, అషూ రెడ్డి పూర్తి చేయగా, ఇక మిగిలిన 12 మందిలో ఎవరి సమాధానాలు సరైనవని భావిస్తున్నారో చర్చించి పేర్లను చెప్పాలని కోరగా, ఆ ముగ్గురూ ఆరుగురి పేర్లను చెప్పారు. రాహుల్‌, వరుణ్‌ సందేశ్‌, వితికా షెరు, శ్రీముఖి, బాబా భాస్కర్‌, జాఫర్‌ ల పేర్లు బిగ్‌ బాస్‌ కు చేరడంతో, ఆ ఆరుగురు నామినేట్‌ అయినట్లు బిగ్‌ బాస్‌ ప్రకటించాడు.

ఇక ఈ నామినేషన్ దేనికోసమోనని అందరూ చర్చించుకుంటుండగానే, నామినేషన్ నుంచి తప్పించుకునే అవకాశాన్ని కల్పిస్తూ, అందరూ కలిసి ఓ మానిటర్‌ ను ఎన్నుకోవాల్సిందిగా సూచించగా, హేమను వారు ఎన్నుకున్నారు. నామినేట్‌ అయిన ప్రతి సభ్యుడు మిగిలిన ఇంటిసభ్యుల్లోంచి ఒకరిని తనకు బదులుగా రీప్లేస్ చేయవచ్చని, అందుకు కారణాలను చెప్పాలని, తుది నిర్ణయం మాత్రం మానిటర్‌ దేనని చెప్పాడు. దీంతో హౌస్ లో తొలిరోజు ప్రశాంతంగా కాకుండా, నిరాశగా ప్రారంభమైంది.

ఒకరికి ఒకరు పూర్తిగా పరిచయాలు కాకుండానే, గొడవలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ నామినేషన్ ప్రక్రియ నుంచి ఎవరు తప్పించుకుంటారు? కొత్తగా ఎవరు చేరుతారన్నది నేడు తేలుతుంది. కాగా, తొలి రోజున ఉదయం వేళ బాబా భాస్కర్‌, జాఫర్‌ లు కాస్త వినోదాన్ని పంచారు. బిగ్‌ బాస్‌ ఓ పాటను ప్లే చేయగా, అందరూ డ్యాన్సులు చేశారు. కొంతమంది సరదాగా ఈత కొడుతూ ఎంజాయ్ చేశారు.

More Telugu News