Andhra Pradesh: ఏపీ కొత్త గవర్నర్ గా బిశ్వ భూషణ్ హరిచందన్ నియామకం

  • ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ
  • ఒడిశా మాజీ మంత్రి, ప్రముఖ న్యాయవాది బిశ్వభూషణ్
  • ఛత్తీస్ గడ్ గవర్నర్ గా అనసూయ ఊకి నియామకం

రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి కొత్త గవర్నర్ ను నియమించారు. ఒడిశాకు చెందిన మాజీ మంత్రి, ప్రముఖ న్యాయవాది బిశ్వ భూషణ్ హరిచందన్ ను గవర్నర్ గా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. వారం రోజుల్లోగా ఏపీ గవర్నర్ గా ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయాన్ని గవర్నర్ నివాసంగా మార్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

గతంలో జనసంఘ్, జనతాపార్టీల్లో బిశ్వ భూషణ్ హరిచందన్ పని చేశారు. 1980 నుంచి 1988 వరకు ఒడిశా బీజేపీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1988లో జనతా పార్టీ లో చేరిన ఆయన 1996లో తిరిగి బీజేపీలో చేరారు. సుదీర్ఘకాలం ఒడిశాలో ప్రజాప్రతినిధిగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఒడిశాలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పని చేశారు. బీజేపీ-బీజేడీ ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రిగా ఉన్నారు. హరిచందన్ కు సాహిత్యం అంటే ఇష్టం. ఒడియా భాషలో ఆయన పలు రచనలు చేశారు. మారుబటాస్, రాణా ప్రతాప్, శేష జలక్, అస్తశిఖ, మానసి పుస్తకాలు రచించారు.

ఇదిలా ఉండగా, ఛత్తీస్ గడ్ గవర్నర్ గా అనసూయ ఊకిని నియమించారు. కాగా, ఇప్పటివరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంయుక్త గవర్నర్ గా నరసింహన్ వ్యవహరించిన విషయం తెలిసిందే.

More Telugu News