టీడీపీని వీడుతారన్న వార్తలపై స్పందించిన నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి!
గత కొంతకాలంగా తాను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయనున్నట్టు వస్తున్న వార్తలపై పీలేరు పార్టీ ఇన్ చార్జ్ నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి స్పందించారు. తాను టీడీపీని వీడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. తన రాజకీయ భవిష్యత్తుపై వస్తున్న వార్తలన్నీ వదంతులేనని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. కలికిరిలో పార్టీ కార్యకర్తలతో మాట్లాడిన ఆయన, చంద్రబాబును వదిలి వెళ్లబోనని అన్నారు. కష్టమైనా, నష్టమైనా ఆయన వెన్నంటే ఉంటానని చెప్పారు. రాష్ట్రంలో ఏ పార్టీ వుంటుంది? ఎవరు బలపడతారు? అన్న విశ్లేషణలను తాను పట్టించుకోబోనని అన్నారు. గతంలో చంద్రబాబు ఎన్నిసార్లు జిల్లాకు వచ్చినా, స్వాగతం పలికేందుకు తాను వెళ్లలేదని, కానీ గతవారంలో మాజీ సీఎంగా బెంగుళూరు విమానాశ్రయానికి చంద్రబాబు వచ్చిన వేళ, ఆయనకు నైతిక స్థైర్యం కలిగించడం కోసం ఎయిర్ పోర్ట్ కు వెళ్లానని తెలిపారు.