Kenya MP: రూ. 200 అప్పును తిరిగి చెల్లించేందుకు 22 ఏళ్ల తరువాత ఇండియా వచ్చిన కెన్యా ఎంపీ!

  • 1985లో ఇండియాలో చదువుకున్న టోంగీ
  • చిరు వ్యాపారి వద్ద ఆహారం కోసం అప్పు
  • ఇంతకాలానికి తిరిగి ఇచ్చేందుకు ఇండియాకు రాక

తాను 22 సంవత్సరాల క్రితం ఇండియాలోని ఓ చిరు వ్యాపారికి బకాయి పడ్డ రూ. 200ను తిరిగి ఇచ్చేందుకు కెన్యాకు చెందిన ఓ పార్లమెంట్ సభ్యుడు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ కు వచ్చారు. కెన్యాలోని న్యారిబారీ చాచే నియోజకవర్గానికి ఎంపీగా ఉన్న రిచర్డ్ నయాగకా టోంగీ తన ఇంటికి వచ్చేసరికి ఆ వ్యాపారి కాశీనాథ్ గావ్లీ ఆనందానికి అవధుల్లేకుండాపోయింది.

తాము 1985 నుంచి 89 మధ్య కాలంలో మౌలానా ఆజాద్ కాలేజీలో మేనేజ్ మెంట్ విద్యను అభ్యసించానని, ఆ సమయంలో కాశీనాథ్ దుకాణంలో సరుకులు తీసుకునేవాణ్ణని టోంగీ వెల్లడించారు. ఆ సమయంలో ఆయనకు చెల్లించాల్సిన రూ. 200 చెల్లించకుండానే కెన్యాకు తిరిగి వెళ్లిపోయానని, ఆపై తనకు వివాహమైందని, ఎప్పటికైనా ఆ డబ్బును తిరిగి చెల్లించాల్సిందేనని భావించానని ఆయన అన్నారు.

ఇంతకాలానికి తన భార్యతో కలిసి ఇండియాకు వచ్చానని, బకాయి పడ్డ డబ్బు ఇచ్చానని, తన మనసు ఎంతో ప్రశాంతంగా ఉందని తనను కలిసిన మీడియాకు టోంగీ వివరించారు. ఇది తనకు ఓ భావోద్వేగపూరితమైన పర్యటనని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. గావ్లీ, అతని బిడ్డలు సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఆపై ఔరంగాబాద్ లో తాను చదివిన కాలేజీకి వెళ్లి, అక్కడి విద్యార్థులను కలిసి ముచ్చటించారు.

More Telugu News