Guntur District: రేపల్లె ఎమ్మెల్యే ఎన్నిక చెల్లందంటూ కోర్టును ఆశ్రయించిన మంత్రి మోపిదేవి

  • మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన మోపిదేవి
  • తనపై నెగ్గిన సత్యప్రసాద్ ఎన్నికల చెల్లదంటున్న వైనం
  • అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపణ

ఏపీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన మోపిదేవి వెంకట రమణ ఓటమి పాలైన విషయం తెలిసిందే. రేపల్లె నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మోపిదేవిపై టీడీపీ తరపున బరిలోకి దిగిన అనగాని సత్యప్రసాద్ విజయం సాధించారు. మోపిదేవిపై 11,555 ఓట్ల తేడాతో అనగాని గెలుపొందారు. అయితే, తనపై అనగాని సత్యప్రసాద్ ఎన్నిక చెల్లదని మోపిదేవి ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కోర్టును ఆశ్రయించారు. ఎన్నికల అఫిడవిట్ లో అనగాని తప్పుడు సమాచారం ఇచ్చారని, వ్యవసాయం, వ్యాపారాన్ని తన వృత్తిగా అందులో పేర్కొన్నారని అన్నారు. ఎమ్మెల్యేగా ఉంటూ వ్యవసాయం చేస్తున్నట్టు చెప్పుకున్నారని న్యాయస్థానానికి సమర్పించిన పిటిషన్ లో పేర్కొన్నారు.

కాగా, మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మోపిదేవి వెంకట రమణ. 2014, 2019 ఎన్నికల్లో రేపల్లె నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మొన్నటి ఎన్నికల్లో మోపిదేవి ఓటమిపాలైనప్పటికీ ఆయన్ని ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తానని జగన్ ప్రకటించారు. ప్రస్తుతం జగన్ కేబినెట్ లో మోపిదేవికి స్థానం దక్కింది. పశు సంరక్షణ, మత్స్య, మార్కెటింగ్ శాఖల మంత్రిగా ఆయన వ్యవహరిస్తున్నారు.

More Telugu News