Andhra Pradesh: నేడు అనంతపురంలో పర్యటించనున్న టీడీపీ అధినేత చంద్రబాబు!

  • ఇప్పటికే కడపకు చేరుకున్న టీడీపీ అధినేత
  • రోడ్డు మార్గంలో తాడిపత్రికి ప్రయాణం
  • హత్యకు గురైన టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు పరామర్శ

టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నేడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఇప్పటికే కడప ఎయిర్ పోర్టు నుంచి అనంతపురానికి చంద్రబాబు రోడ్డు మార్గంలో బయలుదేరారు. ఈరోజు మధ్యాహ్నం తాడిపత్రి మండలం వీరాపురం గ్రామానికి చంద్రబాబు చేరుకుంటారు. అనంతరం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా చెలరేగిన ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన టీడీపీ కార్యకర్త భాస్కరరెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అనంతరం టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి ఇంట్లో చంద్రబాబు భోజనం చేస్తారు.

తర్వాత ధర్మవరం నియోజకవర్గంలోని పత్యాపురం గ్రామంలో హత్యకు గురైన టీడీపీ కార్యకర్త గొల్లరాజు కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శిస్తారు. ఆ తర్వాత ధర్మవరం పట్టణంలోని ఫంక్షన్ హాలులో టీడీపీ కార్యకర్తలతో భేటీ అవుతారు. రాత్రికి అనంతపురం ఆర్ అండ్ బీ అతిథిగృహంలో చంద్రబాబు బస చేస్తారు. అనంతరం రేపు ఉదయం బెంగళూరుకు బయలుదేరి వెళ్లనున్నారు. అక్కడ పనులు ముగించుకుని విమానంలో టీడీపీ అధినేత గన్నవరానికి చేరుకుంటారు.

More Telugu News