Bumrah: అందరూ బాగానే ఆడుతున్నారు... అదో తలనొప్పి!: బుమ్రా

  • ఇది ఆరోగ్యకరమైన పరిణామం అంటూ వ్యాఖ్యలు
  • మాంచెస్టర్ మ్యాచ్ ముందు మీడియాతో మాట్లాడిన బుమ్రా
  • రేపు భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య సెమీఫైనల్ మ్యాచ్

మాంచెస్టర్ లో రేపు భారత జట్టు వరల్డ్ కప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్ తో తలపడనుంది. ఈ నేపథ్యంలో, టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టులో అందరూ బాగా ఆడుతున్నారని, తుది జట్టు ఎంపిక చేయాల్సి వచ్చినప్పుడు అదో తలనొప్పి వ్యవహారమని అభిప్రాయపడ్డాడు. కీలకమైన సెమీస్ మ్యాచ్ బరిలో దిగేముందు ఎవరిని పక్కనపెట్టాలో తెలియని పరిస్థితిని ఇప్పుడు టీమిండియా ఎదుర్కొంటోందని చెప్పారు. అయితే ఇది ఆరోగ్యకరమైన పరిణామం అని బుమ్రా అభివర్ణించాడు.

"బ్యాట్స్ మన్లు, బౌలర్లు ప్రతి ఒక్కరూ రాణిస్తున్నారు. హార్దిక్ పాండ్య, మహ్మద్ షమీ వికెట్లు తీయడం చూస్తున్నాం. నేను కూడా వికెట్ల వేటలో రాణిస్తున్నాను. ఈ పరిణామాన్ని శుభసూచకంగానే భావిస్తాను" అంటూ బుమ్రా తన అభిప్రాయాలు వెల్లడించాడు. తాను విమర్శలను పట్టించుకోనని, తర్వాత మ్యాచ్ పైనే తన దృష్టి ఉంటుందని తెలిపాడు. పాతికేళ్ల బుమ్రా ఈ వరల్డ్ కప్ లో 8 మ్యాచ్ లాడి 17 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో షమీ కేవలం 4 మ్యాచ్ లు ఆడి 14 వికెట్లు పడగొట్టడం విశేషం.

More Telugu News