Hyderabad: డ్రంకెన్ డ్రైవ్‌లో చిక్కిన నిర్మాత కుమారుడు.. కారు దిగి రోడ్డుపై హంగామా!

  • తాను ప్రముఖుడి కుమారుడినంటూ హల్‌చల్
  • కేసు నమోదు చేసి కారు స్వాధీనం చేసుకున్న పోలీసులు
  • వదిలిపెట్టాలంటూ ప్రజాప్రతినిధి నుంచి ఫోన్

హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 10లో ట్రాఫిక్ పోలీసులు శుక్రవారం రాత్రి నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో సినీ నిర్మాత కుమారుడు సాయి నితీశ్ దొరికిపోయి హల్‌చల్ చేశాడు. కారును ఆపిన పోలీసులు బ్రీత్ అనలైజింగ్ పరీక్షకు సిద్ధమవుతుండగా కారు దిగిన యువకుడు నానా హంగామా చేశాడు. తాను ప్రముఖుడి కుమారుడినంటూ పోలీసులతో వాగ్వివాదానికి దిగాడు. దీంతో అక్కడే ఉన్న జూబ్లీహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకుని అతడికి బ్రీత్ టెస్ట్ నిర్వహించారు.

పరీక్షలో అతడు మద్యం తాగినట్టు తేలింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఆ వెంటనే ఓ ప్రజాప్రతినిధి పోలీసులకు ఫోన్ చేసి కారును వదిలిపెట్టాలని ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తోంది. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో 5 కార్లు, 12 బైక్‌లు స్వాధీనం చేసుకున్నట్టు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

More Telugu News