Hyderabad: హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డుపై కాల్పుల కలకలం... వ్యక్తి ఆత్మహత్యాయత్నం!

  • అశ్విన్ జైన్ అనే వ్యక్తికి తీవ్రగాయాలు
  • కేర్ ఆసుపత్రికి తరలింపు
  • పరిస్థితి విషమం

హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డుపై రంగారెడ్డి జిల్లా నార్సింగ్ వద్ద కాల్పుల కలకలం రేగింది. అశ్విన్ జైన్ అనే వ్యక్తి బెంజ్ కారులో వచ్చి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యాయత్నం చేసినట్టు తెలుస్తోంది. మొదట, ఇదేదో గ్యాంగ్ వార్ అనుకుని భయపడిన స్థానికులు, ఆ తర్వాత కారువద్దకు వచ్చి చూడగా అపస్మారక స్థితిలో వ్యక్తి కనిపించాడు. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన జైన్ ప్రస్తుతం గచ్చిబౌలి కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

కారులో లభించిన వివరాల ఆధారంగా జైన్ కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. అయితే, ఈ ఘటనలో పలు అనుమానాలు కలుగుతున్నాయి. ఆత్మహత్యకు పాల్పడే వ్యక్తి అయితే తుపాకీ తలకు గురిపెట్టి పేల్చుకుంటాడని, కానీ బుల్లెట్ గాయాలు ఒంటిపై ఉండడం చూస్తుంటే, కారులో మరెవరైనా ఉండి కాల్పులకు పాల్పడ్డారా? అనే కోణంలో సందేహాలు వస్తున్నాయి.

More Telugu News