teenager: టీనేజర్ పై గ్యాంగ్ రేప్.. ఐదుగురు కన్నడ విద్యార్థుల అరెస్ట్

  • కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఘోరం
  • దళిత విద్యార్థినిపై నలుగురు విద్యార్థుల అత్యాచారం
  • వీడియోను సోషల్ మీడియాలో పెట్టిన ఐదో విద్యార్థి

ఓ టీనేజర్ పై గ్యాంగ్ రేప్ కు సంబంధించిన కేసులో ఐదుగురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో మార్చి నెలలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఈ అత్యాచారానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో... ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగా పోలీసు అధికారి మాట్లాడుతూ, బాధితురాలు దళిత సామాజిక వర్గానికి చెందినదని... ఆమె వయసు 19 ఏళ్లని చెప్పారు. ఓ ప్రైవేట్ కళాశాలలో బాధితురాలితో పాటు, దారుణానికి ఒడిగట్టిన విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. గ్యాంగ్ రేప్ తో పాటు ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేశామని చెప్పారు.

మార్చి మొదటి వారంలో నలుగురు విద్యార్థులు బాధితురాలిని కారులో అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారని... అక్కడ కారులో నుంచి ఆమెను బయటకు లాగి, అత్యాచారం చేశారని పోలీసు అధికారి తెలిపారు. ఈ మొత్తం తతంగాన్ని వీడియో షూట్ చేసి, ఎవరికైనా చెబితే వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తామని హెచ్చరించారని చెప్పారు. ముగ్గురు విద్యార్థులు అత్యాచారం చేస్తుండగా నాలుగో విద్యార్థి వీడియో తీశాడని తెలిపారు. అత్యాచారంతో సంబంధం లేని ఐదో విద్యార్థి ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడని చెప్పారు. ఐదుగురు విద్యార్థులపై కేసు నమోదు చేశామని తెలిపారు. మరోవైపు అత్యాచారానికి పాల్పడిన ఐదుగురిని కాలేజీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ, సోషల్ మీడియాలో ఈ వీడియోను ఎవరూ షేర్ చేయవద్దని కోరారు. ఎవరైనా షేర్ చేస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటారని హెచ్చరించారు.

More Telugu News