Lakshmiparvati: చంద్రబాబుకు నేనిచ్చే సలహా ఇదే: లక్ష్మీపార్వతి

  • వెంటనే లోకేశ్ ను పక్కన బెట్టాలి
  • లోకేశ్ ఎంత ఎక్కువ మాట్లాడితే అంత నష్టం
  • తిరుమలలో లక్ష్మీపార్వతి

తెలుగుదేశం పార్టీ తిరిగి బాగుపడాలంటే వెంటనే లోకేశ్ ను పక్కన బెట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత నందమూరి లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు తానిచ్చే సలహా ఇదేనని చెప్పారు. ఈ ఉదయం తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకున్న ఆమె, అనంతరం మీడియాతో మాట్లాడుతూ, లోకేశ్‌ ఎంత ఎక్కువగా మాట్లాడితే టీడీపీ అంత భ్రష్టు పడుతుందని హెచ్చరించారు. మహిళలను కించపరిచేలా లోకేశ్‌ మాట్లాడుతున్నారని, మరోసారి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అన్నారు. రాష్ట్రంలో జగన్ నేతృత్వంలో ప్రజా పరిపాలన సాగుతోందని, ఇల్లు బాగు చేస్తూంటే ఎలుకలు ఏడ్చినట్టుగా టీడీపీ వ్యవహరిస్తోందని నిప్పులు చెరిగారు.

కాగా నేడు లక్ష్మీపార్వతి సహా  పలువురు ప్రముఖులు తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. నేడు తన పుట్టినరోజు కావడంతో తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు కూడా తిరుమలకు వచ్చారు. ఎమ్మెల్యేలు ద్వారకానాథ్‌ రెడ్డి, కాకాణి గోవర్థన్‌ రెడ్డి, లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ నిర్మాత రాకేశ్‌ రెడ్డి, సినీ రచయిత చిన్నికృష్ణ తదితరులు కూడా స్వామిని దర్శించుకున్నవారిలో ఉన్నారు.

More Telugu News