Andhra Pradesh: కాంట్రాక్టర్లను వేధించడం మా ఉద్దేశం కాదు, ఎవరిపైనా కక్ష లేదు: సీఎం జగన్

  • అర్బన్ హౌసింగ్ ప్రాజెక్టులపై రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలి
  • రివర్స్ టెండరింగ్ లో ఎక్కువ మంది పాల్గొనేలా చూడాలి
  • రాష్ట్రంలో సొంతిల్లు లేని వారెవరూ ఉండకూడదు

కాంట్రాక్టర్లను వేధించడం తమ ఉద్దేశం కాదని, ఎవరిపైనా తమకు కక్ష లేదని ఏపీ సీఎం జగన్ స్పష్టం చేశారు. గృహనిర్మాణ శాఖపై ఈరోజు ఆయన సమీక్షించారు. పట్టణ గృహ నిర్మాణ (అర్బన్ హౌసింగ్) ప్రాజెక్టులపై అదే టెక్నాలజీ, స్పెసిఫికేషన్స్ తో రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని ఆదేశించారు. అధిక ప్రచారం చేయడం ద్వారా ఎక్కువ మంది రివర్స్ టెండరింగ్ లో పాల్గొనేలా చూడాలని సూచించారు.

ఎక్కువ మంది రివర్స్ టెండరింగ్ లో పాల్గొనేందుకు ఎలిజిబులిటీ క్రైటీరియాను తగ్గిద్దామని అన్నారు. పునాది స్థాయి దాటని, శాంక్షన్ అయినా ప్రారంభం కాని ప్లాట్ల విషయంలో ఏ టెక్నాలజీ అయినా అనుమతించాలని అనుకుంటున్నామని అన్నారు. ఈ నిర్ణయాల వల్ల ఎంత ఆదా చేయగలమో అంత చేయండి అని అధికారులకు సూచించారు. నిర్మాణాల నాణ్యత, సౌకర్యాల కల్పనలో రాజీ పడొద్దని, ప్రస్తుతం నడుస్తున్న ఇళ్ల నిర్మాణంలో అత్యవసరంగా పూర్తి చేయాల్సిన వాటిని గుర్తించాలని అన్నారు.

వచ్చే ఏడాది నుంచి ఇళ్ల నిర్మాణం

రాష్ట్రంలో సొంతిల్లు లేని వారెవరూ ఉండకూడదని, సొంతిల్లు పొందే క్రమంలో లబ్ధిదారుడు ఎక్కడా ఒక్క పైసా కూడా ఖర్చు చేయాల్సిన పనిలేదని జగన్ అన్నారు.  ఈ ఏడాది శాచ్యురేషన్ విధానంలో ప్రతి గ్రామంలో లబ్ధిదారులందరికీ 1.5 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు అందజేస్తామని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తామని, ఉగాది రోజున ఇళ్ల స్థలాలు, పట్టాల పంపిణీ కార్యక్రమం అన్ని జిల్లాల్లో ఘనంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

More Telugu News