India: నేడు ఇంగ్లండ్ తో మ్యాచ్... 'పిల్లికి చెలగాటం - ఎలుకకు ప్రాణసంకటమే'!

  • ఈ మ్యాచ్ తోనే సెమీస్ కు వెళ్లాలన్న లక్ష్యంతో ఇండియా
  • తప్పనిసరిగా గెలవాల్సిన స్థితిలో ఇంగ్లండ్
  • ఇంగ్లండ్ ఓడిపోవాలని కోరుకుంటున్న పాకిస్థాన్

వరల్డ్ కప్ లో భాగంగా ఆతిథ్య ఇంగ్లండ్ జట్టుతో నేడు భారత్ తలపడనుంది. ఈ టోర్నీలో ఇంతవరకూ ఓటమిని ఎరుగని భారత్, మరో రెండు మ్యాచ్ లు మిగిలుండగానే సెమీస్ కు వెళ్లి, రిజర్వ్ బెంచ్ కి అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇండియా, సెమీస్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే, తప్పనిసరిగా గెలవాల్సిన స్థితిలో ఇంగ్లండ్ ఉన్నాయి. దీంతో ఈ మ్యాచ్ పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణసంకటంలా తయారైందని క్రీడా పండితులు కామెంట్లు చేస్తున్నారు.

ఇండియా చేతిలో ఇంకా మూడు మ్యాచ్ లుండగా, ఏ మ్యాచ్ లో గెలిచినా, సెమీస్ కు వెళుతుంది. ఇంగ్లండ్ చేతిలో రెండు మ్యాచ్ లుండగా, రెండూ గెలిస్తేనే సెమీస్ అవకాశాలుంటాయి. అది కూడా రెండు బలమైన జట్లతో ఇంగ్లండ్ పోరాడాల్సివుంది. ఇండియాతో మ్యాచ్ తరువాత న్యూజిలాండ్ పైనా ఇంగ్లండ్ గెలవాల్సివుంది.

వరల్డ్ కప్ లో ఇప్పటివరకూ ఇండియా, ఇంగ్లండ్ జట్లు ఏడు సార్లు తలపడగా, చెరో మూడు సార్లు విజయం సాధించాయి. మరో మ్యాచ్ టైగా ముగిసింది. ఇక ఆఫ్గనిస్థాన్ పై గెలిచి, సెమీస్ ఆశలు నిలుపుకున్న పాకిస్థాన్, నేడు జరిగే మ్యాచ్ లో ఇంగ్లండ్ ఓడిపోవాలని బలంగా కోరుకుంటోంది. ఇంగ్లండ్ ఓడితే, ఆ జట్టుకు సెమీస్ అవకాశాలు దాదాపు ఉండవనే చెప్పొచ్చు. ప్రస్తుతం పాక్ జట్టు, ఇంగ్లండ్ కన్నా ఓ పాయింట్ అధికంగా సాధించి, పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది.

More Telugu News