Telangana: పంజాగుట్ట ఫ్లయ్ ఓవర్ పై ఘోర ప్రమాదం... విలేకరి మృతి!

  • 'తెలంగాణ సమాచారం'లో పని చేస్తున్న తాజుద్దీన్
  • ప్రాణం తీసిన అతివేగం
  • కేసు నమోదు చేసిన పోలీసులు

ఈ తెల్లవారుజామున హైదరాబాద్, పంజాగుట్టలోని ఫ్లయ్ ఓవర్ పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో వచ్చిన ఓ కారు బైక్ ను ఢీకొంది. దీంతో బైక్ (టీఎస్ 12 ఎఫ్ జే 4873)పై ఉన్న వ్యక్తి, ఫ్లయ్ ఓవర్ పై నుంచి కిందపడ్డాడు. బేగంపేట నుంచి నాగార్జున సర్కిల్ వైపుగా ఈ కారు వస్తోంది. ఈ ప్రమాదంలో కింద ఉన్న రోడ్డుపై పడ్డ మహమ్మద్ తాజుద్దీన్ అనే యువకుడు, తీవ్రగాయాల పాలై మరణించాడు. తాజుద్దీన్ 'తెలంగాణ సమాచారం' అనే వార్తా పత్రికలో పని చేస్తున్నట్టుగా తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుని జేబులో ఐడీ కార్డు ఉండటంతో, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ఘటనతో ఫ్లయ్ ఓవర్ పై చాలాసేపు ట్రాఫిక్ జామ్ అయింది. ప్రమాదంలో కారు కూడా దెబ్బతింది. పోలీసులు క్రేన్ ను తీసుకు వచ్చి కారును అక్కడి నుంచి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

More Telugu News