Karnataka: ప్రేమను నిరాకరించిన యువతి.. 12సార్లు కసిదీరా పొడిచిన యువకుడు

  • ఎంబీయే చదువుతున్న యువతి
  • కాలేజీ నుంచి వస్తుండగా ప్రేమను వ్యక్తం చేసిన యువకుడు
  • నిరాకరించడంతో రోడ్డుపైనే దాడి

తన ప్రేమను నిరాకరించిందని కోపంతో  నడిరోడ్డుపై ఓ యువతిని కత్తితో దారుణంగా పొడిచి ఆపై గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడో యువకుడు. కర్ణాటకలోని మంగుళూరులో జరిగిందీ ఘటన. దరెళ్లకట్టెలోని బంగమిళ ప్రాంతానికి చెందిన దీక్ష (20) అనే యువతి ఎంబీఏ చదువుతోంది. డ్యాన్స్ మాస్టర్‌గా పనిచేస్తున్న 22 ఏళ్ల సుశాంత్ ఆమెను ప్రేమిస్తున్నాడు.

శుక్రవారం సాయంత్రం కాలేజీ వదిలిన తర్వాత 4:30 గంటల సమయంలో దీక్ష నడుచుకుంటూ వస్తుండగా స్కూటరుపై వచ్చిన సుశాంత్ తన ప్రేమను వ్యక్తం చేశాడు. తనను కూడా ప్రేమించాలని కోరాడు. అందుకామె నిరాకరించడంతో ఒక్కసారిగా విచక్షణ కోల్పోయిన సుశాంత్ కత్తితో విచక్షణ రహితంగా దాడిచేసి 12సార్లు పొడిచాడు. అనంతరం గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.  

నడిరోడ్డుపై జరిగిన ఈ ఘటనతో జనం ఒక్కసారిగా హడలిపోయారు. సుశాంత్‌ను అడ్డుకునేందుకు స్థానికులు ప్రయత్నించగా కత్తి చూపించి బెదిరించాడు. ఆమె సృహ కోల్పోయే వరకు పొడిచిన నిందితుడు తర్వాత అదే కత్తితో గొంతు కోసుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువతి పరిస్థితి విషమంగా ఉందని, యువకుడు కోలుకుంటున్నాడని తెలిపారు.

More Telugu News