India: తనతో వచ్చేయడానికి ప్రియురాలు 'నో' చెప్పిందని గొంతు కోసి చంపిన ప్రియుడు!

  • అనంతరం తానూ గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం
  • దేశరాజధాని ఢిల్లీలో ఘటన
  • మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయిన యువతి

వివాహేతర సంబంధం ఓ నిండు కుటుంబాన్ని బలిగొంది. చిన్న పిల్లాడికి తల్లిని లేకుండా చేసింది. తాను వివాహేతర సంబంధాన్ని కొనసాగించలేనని ప్రియురాలు చెప్పడంతో ఆగ్రహించిన యువకుడు ఆమె గొంతు కోసి తానూ ఆత్మహత్యకు ప్రయత్నించాడు.  దేశరాజధాని ఢిల్లీలో శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీకి చెందిన పింకీ(24) అనే యువతికి అదే ప్రాంతానికి చెందిన మరో యువకుడితో ఐదేళ్ల క్రితం వివాహం అయింది. వీరికి ఓ బాబు ఉన్నాడు. భర్తకు చేదోడువాదోడుగా ఉండేందుకు పింకీ బ్యూటీ పార్లర్ లో పనిచేసేది.

ఈ ఏడాది వాలంటైన్స్ డే(ప్రేమికుల రోజు) సందర్భంగా పింకీకి  సన్నీ(26) అనే యువకుడు పరిచయం అయ్యాడు. ఇదికాస్తా ప్రేమ, వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇద్దరు ఢిల్లీ వీధుల్లో షికార్లు కొడుతూ ప్రేమ కబుర్లు చెప్పుకోవడం మొదలుపెట్టారు. అయితే ఈ విషయం తెలుసుకున్న భర్త ఇంటిలోనే ఉండిపోవాలని భార్యను ఆదేశించాడు. దేవ్ లీ ప్రాంతాన్ని వదిలేసి చిరాగ్ ఢిల్లీ ప్రాంతంలో ఇంటిని తీసుకున్నాడు. అయితే పింకీని తనతో కలవకుండా చేయడంతో సన్నీ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు.

భర్తతో విడాకులు తీసుకోవాలని కోరాడు. అయితే ఇందుకు పింకీ అంగీకరించలేదు. ఈ వివాహేతర సంబంధాన్ని ఇంతటితో ఆపేద్దామని ఆమె స్పష్టం చేసింది. తన వెంట పడితే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించింది. దీంతో పగ పెంచుకున్న సన్నీ శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో నేరుగా ఆమె ఇంటిలోకి వెళ్లిపోయాడు. ఇద్దరం వెళ్లిపోదాం రా.. అని బలవంతపెట్టాడు. ఇందుకు పింకీ ఒప్పుకోకపోవడంతో జేబులోని కత్తి తీసి ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు.

అనంతరం పింకీ గొంతు కోసి తనూ గొంతు కోసుకున్నాడు. ఈ అరుపులు విన్న భవన యజమాని రక్తపు మడుగులో పడిఉన్న ఇద్దరిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వీరిద్దరిని ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించగా, పింకీ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. సన్నీ ఆరోగ్యం విషమంగా ఉందనీ, ఐసీయూలో చికిత్స అందజేస్తున్నామని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

More Telugu News