Donald Trump: ఇక నేనే మోదీతో మాట్లాడి తేల్చుకుంటా: ట్రంప్ అల్టిమేటం!

  • సుంకాల పెంపు ఆమోదయోగ్యం కాదు
  • శుక్రవారం నాటి జీ-20 సదస్సులో చర్చిస్తా
  • ట్విట్టర్ లో వెల్లడించిన ట్రంప్

అమెరికాకు చెందిన వస్తువులపై ఇండియా అదనపు పన్నును వేయడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని, ఈ విషయంలో తానే స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడి తేల్చుకుంటానని యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇండియా పెంచిన సుంకాలను కచ్చితంగా వెనక్కి తీసుకోవాల్సిందేనని ట్రంప్ అల్టిమేటం ఇచ్చారు. శుక్రవారం జపాన్‌ లో జరిగే జీ 20 సదస్సులో తాను మోదీతో భేటీ కానున్నానని, ఇదే విషయమై తాను చర్చించనున్నానని అన్నారు.

"గత కొన్నేళ్లుగా అమెరికా వస్తువులపై ఇండియా భారీగా సుంకాలను విధిస్తోంది. ఈ విషయమై నేను ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడబోతున్నా. దీనికి తోడు ఇప్పుడు మళ్లీ భారత్ సుంకాలను పెంచింది. దీనిని మేము ఏమాత్రం ఆమోదించబోము. వీటిని వెనక్కు తీసుకోవాల్సిందే" అని ట్రంప్‌ తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు. కాగా, ఆమెరికాపై ప్రతీకార చర్యగా, ఇటీవల 28 రకాల దిగుమతి వస్తువులపై భారత్ అదనపు పన్నులు వేసిన సంగతి తెలిసిందే.

More Telugu News