Chandrababu: చంద్రబాబుకు చెప్పే ఢిల్లీ వచ్చాను: టీడీపీ ఎమ్మెల్యే సత్య ప్రసాద్

  • వ్యక్తిగత పనుల నిమిత్తం ఢిల్లీ వచ్చా
  • మా కుటుంబమిత్రుడు గరికపాటి రామోహన్ రావు 
  • వాళ్లింట్లో మేమిద్దరం కలిసి లంచ్ చేశాం

రేపల్లె టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ ఆ పార్టీని వీడనున్నారని బీజేపీలో చేరుతున్నారన్న వార్తలు హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై సత్య ప్రసాద్ స్పష్టత నిచ్చారు. ఢిల్లీలో ఈరోజు రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీజేపీలో తాను చేరుతున్నానంటూ వస్తున్న వార్తలు అబద్ధమని అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ను తాను కలిసినట్టు వస్తున్న వదంతులను నమ్మొద్దని కోరారు. ఈరోజు టీడీపీ మీటింగ్ ఉందని నిన్ననే తనకు ఫోన్ వచ్చిందని, వ్యక్తిగత పనుల నిమిత్తం ఢిల్లీకి వెళ్తున్నానని, రాలేనని తమ అధినేత చంద్రబాబునాయుడుకి చెప్పానని అన్నారు.

చంద్రబాబుకు చెప్పే ఢిల్లీ వచ్చానని, తనకు కుటుంబమిత్రుడైన  గరికపాటి మోహన్ రావుని కలిసేందుకే ఇక్కడికి వచ్చానని చెప్పారు. గరికపాటి నివాసంలో తామిద్దరం కలిసి లంచ్ చేశామని అన్నారు. తమ ప్రాంత అభివృద్ధికి గరికపాటి తనకు ఎంతో సాయపడ్డారని, ఎంపీ ల్యాడ్స్ అందరి కన్నా తనకే ఎక్కువ ఇచ్చారని గుర్తుచేసుకున్నారు.

టీడీపీనీ వీడి బీజేపీలో చేరిన నేతల గురించి ఏమనుకుంటున్నారన్న ప్రశ్నకు సత్య ప్రసాద్ స్పందిస్తూ, అది వారి వ్యక్తిగత విషయమని చెప్పారు. ‘టీడీపీని వదిలి బీజేపీలో చేరమని మీపై ఒత్తిళ్లు రావట్లేదా?’ అన్న ప్రశ్నకు ఆయన జవాబిస్తూ, తానేమీ పెద్ద వ్యాపారవేత్తను కాదని, చిన్న వ్యాపారవేత్తనని, ఇప్పుడు ఫుల్ టైమ్ పొలిటీషియన్ ని అయిపోయానని చెప్పారు. 

More Telugu News