GVL: ఇది చంద్రబాబు తెలియక చేసిన తప్పుకాదు... వెంటనే ఇల్లు ఖాళీ చేయాలి: జీవీఎల్ డిమాండ్

  • చంద్రబాబు నివాసం ఓ అక్రమకట్టడం
  • అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో చేసిన తప్పు
  • అక్రమాలు చేశారు కాబట్టే ప్రజలు సాగనంపారు

బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు. రాజే తప్పుచేస్తే ప్రజలు చేయరా అంటూ మండిపడ్డారు. చంద్రబాబు నివాసం ఓ అక్రమకట్టడం అని, ఆయన వెంటనే ఇల్లు ఖాళీ చేసి, చేసిన తప్పుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అక్రమకట్టడంలో నాలుగేళ్లు నివసించారంటే అది నిజంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టేనని  పేర్కొన్నారు.

"ఇది తెలియక చేసిన తప్పుకాదు. అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో చేసిన తప్పు. మీరు, మీ మంత్రులు ఇలాంటి తప్పులు, అక్రమాలు చేశారు కాబట్టే మిమ్మల్ని ప్రజలు ఇంటికి సాగనంపారు. ప్రజావేదికను కూల్చివేసిన ఈ తరుణంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తను నివసించిన ఇంటిని కూలగొట్టేందుకు తానే స్వాగతించాలి. అలాకాకుండా, నేనే ముఖ్యమంత్రిని, నేనే ప్రతిపక్షనేతని, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అనే ధోరణిని ప్రజాస్వామ్యంలో ఎవరూ సమర్థించకూడదు" అని జీవీఎల్ వ్యాఖ్యానించారు.

More Telugu News