Galla Jaydev: హోదా ఇచ్చేది లేదని కేంద్రం చెబుతోంది... కానీ, హోదా కోసమే ఏపీ ప్రజలు వైసీపీని గెలిపించారు: గల్లా జయదేవ్

  • గత ఐదేళ్లకాలంలో హోదా కోసం టీడీపీ ఎంతో పోరాడింది
  • హోదా అంశం పరిశీలనలో లేదని కేంద్రం చెబుతోంది
  • ఏపీ ప్రజలు స్పష్టమైన మెజారిటీ ఇచ్చింది అందుకే

టీడీపీ ప్రత్యేక హోదా సాధించలేదన్న ఉద్దేశంతోనే ఏపీ ప్రజలు వైసీపీకి ఓట్లేసి గెలిపించారని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ వ్యాఖ్యానించారు. కానీ, ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశం లేదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారని, ఈ నేపథ్యంలో  హోదా సాధించాల్సిన బాధ్యత వైసీపీ పైనే ఉందని గల్లా స్పష్టం చేశారు. హోదాపై నమ్మకంతోనే ప్రజలు వైసీపీకి స్పష్టమైన మెజారిటీ అందించారని అభిప్రాయపడ్డారు. హోదాపై మాట తప్పిన కారణంగానే రాష్ట్రంలో బీజేపీకి ఒక్క సీటు కూడా దక్కలేదని పేర్కొన్నారు.

ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వరాదన్న నిర్ణయానికి మోదీ కట్టుబడి ఉన్నారని, సీఎం జగన్ మాత్రం మోదీని కలిసిన ప్రతిసారి రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడుగుతానని చెబుతున్నారని గల్లా పేర్కొన్నారు. లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై గల్లా జయదేవ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లకాలంలో రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం టీడీపీ తీవ్రంగా పోరాడిందని తెలిపారు.

More Telugu News