Telangana: టీ-పీసీసీ అధ్యక్షుడి మార్పు విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు: కుంతియా

  • ఏఐసీసీ నిర్ణయం తీసుకునే వరకూ ఆ పదవిలో ఉత్తమ్ కొనసాగుతారు
  • గెలిచిన తర్వాత కోమటిరెడ్డి ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు?
  • జులై మొదటి వారంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీల సమావేశం

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి మార్పు విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ కుంతియా పేర్కొన్నారు. హైద్రాబాద్ లోని గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఏఐసీసీ నిర్ణయం తీసుకునే వరకూ ఆ పదవిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనసాగుతారని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశాన్ని ప్రస్తావించారు. క్రమశిక్షణను ఎవరూ ఉల్లంఘించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. గెలిచిన తర్వాత ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని, ఏదైనా చెప్పాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి చెప్పాలని, పార్టీ నుండి వెళ్లిపోతే పదవులకు రాజీనామా చేయాలని సూచించారు. 

ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీనే కొనసాగాలని ఆయన కోరారు. రాహుల్ మంచి ఫైటర్ అన్న విషయం మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో తేలిపోయిందని అన్నారు. మున్సిపల్ ఎన్నికల గురించి మాట్లాడుతూ, ఈ ఎన్నికల వ్యూహరచనకు సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో ఓ కమిటీ వేస్తామని, జులై మొదటి వారంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీల సమావేశం నిర్వహించనున్నట్టు చెప్పారు.

More Telugu News