Telugudesam: సాంకేతికంగా చూస్తే టీడీపీ విలీనం చెల్లదు: రామ్మోహన్ నాయుడు

షార్ట్స్‌లో చూడండి
టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తాజాగా పార్టీలో ఏర్పడిన సంక్షోభంపై స్పందించారు. నలుగురు రాజ్యసభ సభ్యులు టీడీపీని వీడి బీజేపీలో చేరడం పట్ల ఆయన మాట్లాడుతూ, సాంకేతికపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుంటే టీడీపీ విలీనం చెల్లదని అన్నారు. విలీనం చెందాలంటే ఓ పార్లమెంటరీ పార్టీలో మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరమని అన్నారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీలో లోక్ సభ, రాజ్యసభ సభ్యులను కలుపుకుని తొమ్మిది మంది ఉన్నప్పుడు, వాళ్లలో నలుగురు వెళ్లిపోతే 2/3 మెజారిటీ ఎలా అవుతుందని ప్రశ్నించారు.

ఒకవేళ కేవలం రాజ్యసభను లెక్కలోకి తీసుకుంటే ఆరుగురు సభ్యుల్లో నలుగురు వెళ్లిపోతే 2/3 మెజారిటీ అవుతుంది కదా అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా, 1992లో సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి ఓ తీర్పు వెలువడిందని, ఉభయసభల సభ్యులను మొత్తంగా పరిగణనలోకి తీసుకున్న ఆ సందర్భాన్ని కూడా తాము ప్రస్తావిస్తామని పేర్కొన్నారు. దీనిపై మరింత లోతుగా చర్చించి, న్యాయసలహా తీసుకుని ముందుకు వెళతామని చెప్పారు.

అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత టీడీపీ పార్లమెంటరీ పార్టీ తరఫు నుంచి కూడా రాజ్యసభ చైర్మన్ కు ఓ లేఖ అందజేస్తామని వెల్లడించారు. ఇక, అకస్మాత్తుగా నలుగురు ఎంపీలు పార్టీని వీడడం వెనుక కొంత కుట్ర కూడా ఉండొచ్చని యువనేత అభిప్రాయపడ్డారు. టీడీపీని దెబ్బతీసేందుకే ఫిరాయింపులను ప్రోత్సహించి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Telugudesam
Ram Mohan Naidu

More Telugu News