Posani Krishna Murali: ఎన్టీఆర్ వచ్చినా ఇక్కడ బండి నడవదు: పోసాని

  • జగన్ ఆ అవకాశం ఎవరికీ ఇవ్వరు
  •  హీరోలను నమ్మే రోజులు పోయాయి
  •  హీరో ఇమేజ్ వేరు .. రాజకీయం వేరు   

సినీ రచయితగా .. నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకున్న పోసాని కృష్ణమురళి, సమకాలీన రాజకీయాలపై కూడా తన గళాన్ని వినిపిస్తుంటారు. ఇటీవలే చిన్నపాటి సర్జరీ చేయించుకున్న ఆయన, ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మీడియా అడిగిన ప్రశ్నలకి ఆయన తనదైన శైలిలో సమాధానాలిచ్చారు.

జూనియర్ ఎన్టీఆర్ చేతిలోకి టీడీపీ పగ్గాలు వెళ్లే అవకాశం ఉందనే ప్రచారంపై ఆయన స్పందిస్తూ, " జగన్మోహన్ రెడ్డిగారి పరిపాలన బాగోలేనప్పుడు .. అంతా అవినీతిమయమైపోయినప్పుడు మాత్రమే ఇక్కడ సీనియర్ ఎన్టీఆర్ కైనా .. జూనియర్ ఎన్టీఆర్ కైనా ఒక ప్లేస్ ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి అవకాశం ఎవరికీ ఇవ్వరు. హీరో ఇమేజ్ వేరు .. రాజకీయాలు వేరు. జూనియర్ ఎన్టీఆర్ ఎంతటి చిత్తశుద్ధితో వచ్చినా ఇక్కడ ఆయన బండి నడవదు. ఒక హీరో వచ్చి ఆకాశంలో నుంచి చుక్కలు తీసుకొస్తానంటే నమ్మే రోజులు పోయాయి. ఎవరు ఏ ఉద్దేశంతో తమ మధ్యలోకి వచ్చేశారనేది జనం కనిపెట్టేశారు" అని చెప్పుకొచ్చారు.

More Telugu News