Andhra Pradesh: ఫిరాయింపులను ప్రోత్సహించనన్న జగన్ ని అభినందిస్తున్నా: టీడీపీ నేత బుద్ధా వెంకన్న

  • జగన్ వ్యాఖ్యలపై బుద్ధా వెంకన్న హర్షం
  • గవర్నర్ ప్రసంగం కేవలం ‘నవరత్నాలు’ పైనే ఉంది
  • కోటంరెడ్డి వ్యాఖ్యలు కరెక్టు కాదు

పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించనని చెప్పిన సీఎం జగన్ వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న హర్షం వ్యక్తం చేశారు. అమరావతిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, నిన్న అసెంబ్లీలో జగన్ చేసిన వ్యాఖ్యలను తాను వ్యక్తిగతంగా అభినందిస్తున్నట్టు చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఎనిమిది మంది తమతో టచ్ లో ఉన్నారని వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బుద్ధా స్పందిస్తూ, ఆయన చేసిన వ్యాఖ్యలు కరెక్టు కాదని అన్నారు. నిన్న అసెంబ్లీలో మాజీ సీఎం చంద్రబాబు గురించి అధికార పక్ష సభ్యులు హేళనగా మాట్లాడటం సబబు కాదని అన్నారు.

ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ఈరోజు చేసిన ప్రసంగం గురించి బుద్ధా మాట్లాడుతూ, ఈ ప్రసంగం కేవలం ‘నవరత్నాలు’పైనే ఉందని, మిగతా విషయాల గురించి ఆయన పెద్దగా మాట్లాడలేదని అన్నారు. ఈ ‘నవతర్నాలు’లో చాలా రత్నాలను తమ ప్రభుత్వం హయాంలో అమలు చేశామని, ఇవేవీ కొత్తగా అమలు చేసేవి కాదని, పేర్లు మార్చారని అన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి పదిపదిహేను రోజులే అయింది కనుక, వేచి చూస్తామని, ఇప్పుడే విమర్శలు గుప్పించడం కరెక్టు కాదని అన్నారు. ఇరిగేషన్’కు తక్కువ ప్రాధాన్యత ఇచ్చారని, ప్రజలకు కావాల్సిన అవసరాలు చాలా ఉన్నాయని, వాటిని ఇందులో పొందుపర్చలేదని అన్నారు.

More Telugu News