Nirav Modi: నీరవ్ మోదీకి మరోసారి చుక్కెదురు... బెయిల్ నిరాకరించిన యూకే కోర్టు

  • నాలుగోసారి బెయిల్ పిటిషన్ తిరస్కరణ
  • త్వరలోనే నీరవ్ మోదీని భారత్ కు అప్పగించే అవకాశం
  • సిద్ధమవుతున్న ముంబయి ఆర్థర్ రోడ్ జైలు!

పంజాబ్ నేషనల్ బ్యాంకును వేల కోట్ల మేర మోసగించాడంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ లండన్ పారిపోయిన సంగతి తెలిసిందే. అయితే, నీరవ్ మోదీని అప్పగించాలంటూ భారత్ న్యాయపరమైన పోరాటం చేస్తోంది. మరోవైపు నీరవ్ మోదీ కూడా బెయిల్ కోసం పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నా ఫలితం దక్కడంలేదు. తాజాగా, నీరవ్ బెయిల్ పిటిషన్ పై లండన్ లోని రాయల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ విచారణ జరిపింది. బెయిల్ ఇవ్వడానికి సహేతుకమైన కారణాలు లేవంటూ పిటిషన్ కొట్టిపారేసింది.

నీరవ్ మోదీ బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురికావడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ పలుమార్లు చుక్కెదురైంది. మోదీ అప్పగింత కేసును విచారిస్తున్న వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు ఇప్పటికే మూడు సార్లు బెయిల్ పిటిషన్లను కొట్టిపారేసింది. కాగా, నీరవ్ మోదీని భారత్ కు అప్పగించే ప్రక్రియ ఊపందుకున్నట్టు సమాచారం. నీరవ్ మోదీని భారత్ కు అప్పగిస్తే ముంబయిలోని ఆర్ధర్ రోడ్ జైలులో ప్రత్యేక సెల్ లో ఉంచే అవకాశాలున్నాయి.

More Telugu News