Andhra Pradesh: తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అడుగుజాడల్లోనే.. ప్రజా దర్బార్ నిర్వహించనున్న సీఎం జగన్!

  • తాడేపల్లి క్యాంపు ఆఫీసులో ఏర్పాటు
  • రోజుకు అరగంట పాటు ప్రజలతో భేటీ
  • విధివిధానాలు రూపొందిస్తున్న అధికారులు

2004 నుంచి 2009లో చనిపోయేవరకూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండేవారు. రోజూ సెక్రటేరియట్ కు వెళ్లేముందు తన క్యాంపు ఆఫీసు దగ్గర వేర్వేరు సమస్యలను చెప్పుకునేందుకు వచ్చే ప్రజలను కలిసేవారు. వారి నుంచి అర్జీలు, దరఖాస్తులను స్వయంగా తీసుకునేవారు. ఆయా అర్జీలను సాయంత్రానికల్లా పరిష్కరించేలా జిల్లాల కలెక్టర్లు, అధికారులను పరుగులు పెట్టించేవారు. తాజాగా ఆయన తనయుడు, ఏపీ ముఖ్యమంత్రి జగన్ తండ్రి బాటలోనే నడవాలని నిర్ణయం తీసుకున్నారు.

వైఎస్ తరహాలో తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీసులో ప్రజలతో మమేకం కావాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇందులో భాగంగా వచ్చే నెల మొదటివారం నుంచి రోజూ ఉదయం అరగంట చొప్పున ప్రజలను కలుసుకోవాలని జగన్ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇందుకోసం తగిన విధివిధానాలు రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించినట్లు వెల్లడించాయి. త్వరలోనే ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుందని పేర్కొన్నాయి.

More Telugu News