Social Media: వరల్డ్ కప్ లో 11వ జట్టు... ఈసారి వరుణుడిదే గెలుపట... సోషల్ మీడియాలో జోక్ ల వెల్లువ!

  • సెటైరికల్ మీమ్స్ తో నిండిపోతున్న సోషల్ మీడియా
  • ఇప్పటికే మూడు మ్యాచ్ లు వర్షార్పణం
  • నేడు, రేపటి భారత్ మ్యాచ్ కూ వరుణుడి దెబ్బ!

క్రికెట్ వరల్డ్ కప్ పోటీలంటే, ప్రత్యర్థి జట్టు చిన్నదైనా, పెద్దదైనా పూర్తి శక్తి సామర్థ్యాలతో పోటీ పడాల్సిందే. అయితే, ఈ వరల్డ్ కప్ లో మాత్రం వరుణుడు తన సత్తాను చూపిస్తూ, బలమైన జట్ల అవకాశాలను దెబ్బతీస్తున్నాడు. ఈ సీజన్ పోటీల్లో వరుణుడు ఇప్పటికే మూడు మ్యాచ్ లను తన ఖాతాలో వేసుకోగా, క్రికెట్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా సెటైర్ల మీద సెటైర్లు వేస్తూ, రెయినీ సీజన్ లో పోటీలను పెట్టిన ఐసీసీపై విరుచుకుపడుతున్నారు. వరుణదేవుడి జట్టు ఇప్పటికే ఆరు పాయింట్లను తన ఖాతాలో వేసుకుందని, ఇక ఆ జట్టు సెమీస్ కు వెళ్లి, మరో మ్యాచ్ ని అడ్డుకోవడం ఖాయంగా ఉందని వ్యంగ్యోక్తులు విసురుతున్నారు.

కాగా, లండన్ పరిసరాల్లో రుతుపవనాల కారణంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. 7వ తేదీన పాకిస్థాన్, శ్రీలంక మ్యాచ్, సోమవారం నాడు దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ మధ్య జరగాల్సిన మ్యాచ్, నిన్న బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య మ్యాచ్ వర్షార్పణం అయిన సంగతి తెలిసిందే.

ఇక నేడు పాకిస్థాన్, ఆస్ట్రేలియా మధ్య, గురువారం నాడు భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య పోటీలు జరగాల్సివుండగా, వర్షం అడ్డంకిగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తేల్చడంతో క్రికెట్‌ అభిమానులు అసహనానికి లోనవుతున్నారు. సెటైరిక్ల్ మీమ్స్‌ ను సోషల్ మీడియాలో పెట్టి జోకులు వదులుతున్నారు. మరో రెండు మూడు మ్యాచ్ లను వర్షం అడ్డుకుంటే, చాంపియన్ ఎవరో తేల్చాల్సిన అవసరం లేదని, ఆడకుండానే ఎవరో ఒకరు కప్పెత్తుకు పోతారని అంటున్నారు.

More Telugu News