janasena: అధికారం సాధించే దిశలో పవన్ కల్యాణ్ విజయం సాధించలేకపోయారు: రావెల కిశోర్ బాబు

  • పవన్ కల్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు గొప్పవే
  • సమసమాజ నిర్మాణం పవన్ ఆశయం
  • అధికారంలో లేకుండా ఎన్ని మాటలు చెప్పినా వృథానే 

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై ఆ పార్టీకి ఇటీవల రాజీనామా చేసిన రావెల కిశోర్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో నిన్న ప్రధాని మోదీ ఆధ్వర్యంలో బీజేపీలో చేరిన రావెల కిశోర్ బాబు ఈరోజు గుంటూరుకు వచ్చారు. ఈ సందర్భంగా తనను పలకరించిన మీడియాతో రావెల మాట్లాడారు.

టీడీపీని వీడి జనసేనలో చేరిన అతి తక్కువ సమయంలోనే ఆ పార్టీ నుంచి బయటకు రావడానికి గల కారణాలపై రావెలను ప్రశ్నించగా ఆయన స్పందిస్తూ, పవన్ కల్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు, సమాజంలో మార్పు తీసుకురావాలన్న తపన చాలా గొప్పవని అన్నారు. అవినీతి రహిత పరిపాలన, సమసమాజ నిర్మాణం పవన్ ఆశయమని, ఈ ఆశయం నెరవేరాలంటే అధికారాన్ని అందుకోవాలని, అధికారంలో లేకుండా ఎన్ని మాటలు చెప్పినా అవన్నీ వృథానే అని అన్నారు. అధికారం సాధించే దిశలో పవన్ కల్యాణ్ విజయం సాధించలేకపోయారని అభిప్రాయపడ్డారు. 

More Telugu News