Pawan Kalyan: అలా చేసుంటే మన బలం మరింత పెరిగేది: పవన్‌ కల్యాణ్

  • ఇతర పార్టీల నేతలు కోట్లు ఖర్చు చేశారు
  • ఎన్నికలు సక్రమంగా జరిగి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవి
  • నాలుగేళ్ల క్రితమే పోటీ చేసి ఉంటే.. మన బలం మరింత పెరిగేది

ఎన్నికలు సక్రమ పద్ధతిలో జరగలేదని... ఇతర పార్టీల నేతలు కోట్ల రూపాయలను ఖర్చు చేశారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. సక్రమంగా ఎన్నికలు జరిగి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవని అన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల ఖర్చు రూ. 150 కోట్లు దాటిందని... జనసేన ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని తెలిపారు. ఓటర్లకు డబ్బు ఎరవేయకుండా, స్వచ్ఛమైన రాజకీయాలు చేశామని అన్నారు.

నాలుగేళ్ల క్రితమే తాము పోటీ చేసి ఉంటే తమ బలం మరింత పెరిగేదని చెప్పారు. జనసేన కోసం యువతీయువకులు, మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని... అందుకే తమకు లక్షల ఓట్లు వచ్చాయని తెలిపారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో తూర్పుగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పైమేరకు వ్యాఖ్యానించారు. ఎన్నికల ఫలితాలతో డీలా పడకుండా... ప్రజల కోసం మరింత బలంగా ముందుకు సాగుదామని అన్నారు. ఇబ్బందుల్లో ఉన్న వారికి మేమున్నాం అనే భరోసా ఇవ్వడం ముఖ్యమని తెలిపారు.

More Telugu News