YSRCP: రాజన్న రాజ్యం దిశగా జగన్ అడుగులు వేస్తున్నారు: ఎమ్మెల్యే రోజా

  • ఏపీకి డిప్యూటీ సీఎంలను నియమిస్తున్న ప్రకటనపై హర్షం
  • జగన్ నిర్ణయం  సంచలనం సృష్టించింది: ఉమ్మారెడ్డి
  • రాష్ట్రం స్వర్ణయుగంలా మారబోతోంది: బొత్స

ఏపీకి ఐదుగురు ఉపముఖ్యమంత్రులను నియమిస్తున్నట్టు సీఎం జగన్ ప్రకటించడంపై ఆ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ, జగన్ నిర్ణయం రాజకీయాల్లో సంచలనం సృష్టించిందని అన్నారు. అందరికీ సమన్యాయం చేస్తామని జగన్ హామీ ఇచ్చారని, ఇచ్చిన మాట ప్రకారం ముందుకు వెళ్తున్నారని కొనియాడారు. రాబోయే రోజుల్లో ప్రజలు అద్భుతమైన పాలన చూస్తారని అన్నారు.

వైసీపీకి చెందిన మరో నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో జగన్ లాంటి సీఎంను ఇంతవరకూ చూడలేదని కొనియాడారు. మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపుతున్న సీఎం జగన్ అని, పదవుల్లో సామాజిక న్యాయం చూపుతున్న ఘనత ఆయనదేనని ప్రశంసించారు. జగన్ నాయకత్వంలో రాష్ట్రం స్వర్ణయుగంలా మారబోతోందని అన్నారు.

నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ, రాజన్న రాజ్యం దిశగా వైఎస్ జగన్ అడుగులు వేస్తున్నారని అన్నారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించారని, వైఎస్ జగన్ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని అన్నారు.

More Telugu News