Bihar: తానొస్తే నిలబడలేదని మెడికల్ షాపు ఉద్యోగిని చావబాదిన బీజేపీ సీనియర్ నేత సోదరుడు!

  • పరారీలో నిందితుడు
  • బాధితుడికి రక్షణ కల్పించిన పోలీసులు
  • సోదరుడితో తనకు సంబంధం లేదన్న బీజేపీ నేత

తానొస్తే లేచి నిలబడి విష్ చేయలేదన్న కోపంతో ఓ మెడికల్ షాపు ఉద్యోగిని దుకాణంలోనే చావబాదాడో బీజేపీ నేత సోదరుడు. బీహార్‌లోని బెత్తై నగరంలో ఈ నెల 3న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బీజేపీ జాతీయ ఉపాధ్యాక్షురాలైన రేణు దేవి సోదరుడు పిను రాత్రి 9:10 గంటలకు ఓ మెడికల్ షాపు వద్దకు వచ్చాడు. దుకాణంలోని అందరూ లేచి నిలబడి ఆయనకు నమస్కారం పెట్టగా ఓ వ్యక్తి మాత్రం కూర్చునే ఉన్నాడు. అతడిని చూసి ఆగ్రహంతో ఊగిపోయిన పిను షాపులోకి వెళ్లి అతనిపై చేయి చేసుకున్నాడు. వారికి అతడి అనుచరులు కూడా తోడయ్యారు. అందరూ కలిసి అతడిని చితకబాదారు.

ఈ మొత్తం ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. అనంతరం సోషల్ మీడియాకు ఎక్కడంతో వైరల్ అయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడు పిను కోసం గాలిస్తున్నారు. అలాగే, బాధితుడికి రక్షణ కల్పించినట్టు చెప్పారు. ఈ ఘటనపై స్పందించిన రేణు దేవి తన సోదరుడితో తనకు ఎటువంటి సంబంధం లేదని, అతడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

More Telugu News