TV9: అజ్ఞాతం వీడి బయటికొచ్చిన రవిప్రకాశ్... సీసీఎస్ పోలీసుల ఎదుట హాజరు

  • పోలీసుల ఎదుట హాజరుకావాలన్న సుప్రీం
  • సుప్రీం ఆదేశాలను పాటించిన రవిప్రకాశ్
  • ఫోర్జరీ వ్యవహారంలో రవిప్రకాశ్ పై కేసు

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ఎట్టకేలకు అజ్ఞాతం నుంచి బయటికి వచ్చారు. వాటాలు, ఫోర్జరీకి సంబంధించిన వ్యవహారంలో టీవీ9 నూతన యాజమాన్యం రవిప్రకాశ్ పై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఆయన ఎవరికీ కనిపించలేదు. సీసీఎస్ పోలీసులు నోటీసులు పంపినా స్పందించలేదు. ముందస్తు బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

ఈ నేపథ్యంలో, ఎవరూ ఊహించని విధంగా రవిప్రకాశ్ ఈ మధ్యాహ్నం హైదరాబాద్ సీసీఎస్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. రవిప్రకాశ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై నిన్న సుప్రీం కోర్టులో విచారణ జరగ్గా, తిరిగి హైకోర్టుకే వెళ్లాంటూ సుప్రీం పేర్కొంది. అంతేకాకుండా, సీసీఎస్ పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాలంటూ స్పష్టంచేసింది. ఈ క్రమంలోనే రవిప్రకాశ్ బయటికి వచ్చినట్టు అర్థమవుతోంది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News