Hyderabad: హైదరాబాద్ ఐటీ కంపెనీని దారుణంగా మోసగించి రూ. 1.09 కోట్లు నొక్కేసిన సైబర్ నేరగాళ్లు!

  • ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను తయారు చేసే రాడిక్స్ మైక్రో సిస్టమ్
  • ఈ-మెయిల్ ద్వారా మోసగించిన సైబర్ నేరగాళ్లు
  • కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు

హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఐటీ సంస్థ రాడిక్స్‌ మైక్రో సిస్టమ్‌ ను ఓ తప్పుడు ఈ-మెయిల్ ద్వారా మోసగించిన సైబర్‌ నేరస్థులు, రూ. 1.09 కోట్లు కొల్లగొట్టారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, హాంకాంగ్‌ కు చెందిన సన్ ఆనర్స్ హోల్డింగ్ అనే సంస్థ, రాడిక్స్‌ మైక్రో సిస్టమ్‌ కు ముడిసరుకును సరఫరా చేస్తుంటుంది. ఈ కంపెనీ పలు రకాల ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను తయారు చేస్తుంటుంది. హాంకాంగ్ నుంచి ముడి సరుకు వచ్చిన తరువాత, గత నెల 20న 1.56 లక్షల డాలర్లు (రూ. 1.09 కోట్లు) పంపనున్నామని సంస్థ ప్రతినిధి రాజ్ కుమార్, సన్ ఆనర్స్ హోల్డింగ్ కు మెయిల్ పంపించాడు.

అదే రోజు సన్ ఆనర్స్ నుంచి తమ బ్యాంకు ఖాతా మారిందని, దానిలో డబ్బు వేయాలని ఈ-మెయిల్ వచ్చింది. ఆ వెంటనే గత నెల 21వ తేదీన సన్ ఆనర్స్ కు డబ్బు పంపారు. ఆపై నగదు బదిలీ చేశానని చెబుతూ, రిసీట్ పంపగా, అది తమ ఖాతా కాదని, తమ ఈ-మెయిల్ ను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు, వాళ్ల ఖాతా నంబర్ ను పంపారని తేల్చారు. దీనిపై 2వ తేదీన రాజ్ కుమార్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే ఘటనపై హాంకాంగ్ లో సైతం ఫిర్యాదు నమోదైంది.

More Telugu News