Marriage: పెళ్లి మేకప్ కోసం బ్యూటీషియన్ వద్దకు వెళితే... చర్మం ఊడి చేతిలోకొచ్చింది!

  • గుజరాత్ లో ఘటన
  • పోలీసులకు బాధితుల ఫిర్యాదు
  • కేసును విచారిస్తున్న పోలీసులు

బంధువుల ఇంట్లో జరుగుతున్న పెళ్లికి వెళ్లిన ఓ తల్లి ఆమె ఇద్దరు కుమార్తెలు బ్యూటీ పార్లర్‌కు వెళ్లి మేకప్ చేయించుకోగా, వారి చర్మం ఊడి అనారోగ్యం పాలై, ఐసీయూలో చేరాల్సి వచ్చింది. గుజరాత్ లోని ఓల్పాడ్ సమీపంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు, బాధితులు అందించిన వివరాల ప్రకారం, తన కుమార్తెలతో కలిసి సాయణ్ గ్రామంలో జరిగిన పెళ్లికి వెళ్లిన మహిళ, ఓ బ్యూటీషియన్ వద్ద మేకప్ చేయించుకున్నారు.

ఆపై పెళ్లికి వెళ్లి, విందు ముగిసిన తరువాత సూరత్ కు చేరుకున్నారు. వారు ముగ్గురూ ముఖం కడుక్కోగా, చర్మం ఊడిరావడంతో పాటు ముఖం వాచిపోయింది. దీంతో వారు తీవ్ర ఆందోళనతో ఆసుపత్రిలో చేరారు. డాక్టర్లు వారిని పరీక్షించి, హానికారక రసాయనాలను ముఖంపై వాడారని తేల్చి ఐసీయూలో అడ్మిట్ చేసుకున్నారు. ఈ విషయంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వగా, సంబంధిత బ్యూటీషియన్‌ ను విచారిస్తున్నామని తెలిపారు. ఆమె ఉద్దేశపూర్వకంగానే కెమికల్స్ ను వాడినట్టు అనుమానిస్తున్నామన్నారు.

More Telugu News