Telangana: హాజీపూర్ వరుస హత్యల కేసులో బాలిక సెల్ ఫోన్ కోసం పోలీసుల గాలింపు

  • శ్రీనివాస్ రెడ్డిని మరోసారి కస్టడీలోకి తీసుకున్న పోలీసులు
  • హత్యకు గురైన బాలిక ఆధార్ కార్డు లభ్యం
  • మరో విద్యార్థిని ఐడీ కార్డును గుర్తించిన పోలీసులు

కొన్నినెలల క్రితం యాదాద్రి జిల్లా హాజీపూర్ లో వెలుగుచూసిన దారుణాలు తెలుగు రాష్ట్రాలను నివ్వెరపరిచాయి. శ్రీనివాస్ రెడ్డి అనే యువకుడు అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడి, వారిని కిరాతకంగా అంతమొందించిన వైనం హాజీపూర్ గ్రామాన్నే కాదు ప్రతి ఒక్కరినీ ఒళ్లు గగుర్పొడిచేలా చేసింది. బావిలో వరుసగా ఒక్కో అమ్మాయి మృతదేహం ఆనవాళ్లు లభ్యం కావడం సంచలనం సృష్టించింది. నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. ప్రస్తుతం అతడిని మరోసారి కస్టడీలోకి తీసుకున్నారు.

విద్యార్థినులపై హత్యాచారం చేసి వారి దేహాలను పొదల్లో దాచి చీకటి పడగానే బావిలోకి విసిరేసేవాడ్నని శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు తెలిపినట్టు సమాచారం. కాగా, శ్రీనివాస్ రెడ్డి చంపేసిన ఓ అమ్మాయికి చెందిన ఆధార్ కార్డు బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ వెనుకభాగంలో ఉన్న ఓ చెరువులో లభ్యం అయింది. ఇప్పుడా బాలిక సెల్ ఫోన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరో విద్యార్థినికి చెందిన ఐడీ కార్డు హాజీపూర్ నుంచి మైసిరెడ్డిపల్లి వెళ్లే మార్గంలో గుర్తించారు.

More Telugu News