Bommakuru: మరదళ్లతో కలిసి రిజర్వాయర్ లో సెల్ఫీల సరదా... ముగ్గురి దుర్మరణం!

  • శనివారం నాడు అత్తవారింటికి వచ్చిన అవినాశ్
  • భార్య, మరదళ్లతో కలిసి వ్యాహ్యాళికి
  • ముగ్గురిని మింగేసిన బొమ్మకూరు రిజర్వాయర్

తన మరదళ్లతో కలిసి వ్యాహ్యాళికి వెళ్లిన ఓ యువకుడు, రిజర్వాయర్ లో వారితో ఆడుతూ ప్రమాదవశాత్తూ ఊబిలో కూరుకుపోయి మరణించాడు. ఈ ప్రమాదంలో అతని ఇద్దరు మరదళ్లు కూడా మృతి చెందడంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, జనగామకు చెందిన మాజీ కౌన్సిలర్‌ మూడ్‌ లక్ష్మణ్‌ నాయక్ కుమారుడు అవినాశ్ (29)కు గత సంవత్సరం వివాహం జరిగింది.

హైదరాబాద్ లో ఉండే అవినాశ్, శనివారం నాడు గిద్దెబండతండాలోని అత్తగారింటికి వచ్చాడు. మధ్యాహ్నం భార్య దివ్యతోపాటు చిన్న మామ కుమార్తెలు సంగీత (17), సుమలత (15)తో కలసి బొమ్మకూరు రిజర్వాయర్‌ వద్దకు వెళ్లారు. ఒడ్డున కూర్చున్న భార్య దివ్య ఫొటోలు తీస్తుండగా అవినాష్, సంగీత, సుమలత నీటిలోకి దిగారు. ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకుంటూ ఆడుకుంటున్న వేళ, రిజర్వాయర్ లోని ఊబి వారిని మింగేసింది.

ముగ్గురూ నీటిలో మునిగిపోతుండటాన్ని గమనించి, దివ్య కేకలు వేయగా, స్థానికులు వచ్చి మృతదేహాలను వెలికితీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరిలించారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు తెలిపారు.

More Telugu News