Andhra Pradesh: ఉక్కపోతతో అల్లాడిపోయే విజయవాడ జగన్ కోసం చల్లగా మారిపోయింది!: చెవిరెడ్డి భాస్కరరెడ్డి

  • జగన్ కు దేవుడు, వైఎస్, ప్రజల దీవెనలు ఉన్నాయి
  • నిజాయతీతో పనిచేసిన అధికారుల్ని జగన్ నియమిస్తున్నారు
  • మీడియాతో మాట్లాడిన చంద్రగిరి ఎమ్మెల్యే

గత తొమ్మిదేళ్ల కాంగ్రెస్, టీడీపీ పాలనలో ఏపీ ప్రజలు అల్లాడిపోయారని వైసీపీ నేత, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి తెలిపారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనతో విసిగిపోయిన ప్రజలు జగన్ కు అధికారం కట్టబెట్టారని వ్యాఖ్యానించారు. జగనన్న ముఖ్యమంత్రి అయితేనే అన్ని కులాలు, మతాలకు అతీతంగా న్యాయం జరుగుతుందని ప్రజలు భావించారని చెప్పారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియానికి చేరుకున్న చెవిరెడ్డి మీడియాతో మాట్లాడారు.

‘నా అడుగు జనం కోసం. నా జీవితం జనం కోసం’ అని జగన్ చెప్పిన విషయాన్ని చెవిరెడ్డి గుర్తుచేశారు. నిజాయతీతో పనిచేసిన అధికారులను తీసుకొచ్చి జగన్ ముఖ్యమైన పదవుల్లో పెడుతున్నారనీ, అక్కడే జగన్ పరిపాలనా దక్షత కనిపిస్తోందని చెప్పారు.

మధ్యాహ్నం 11.30 అంటే విజయవాడలో ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోతారనీ, కానీ జగన్ ప్రమాణస్వీకారానికి విజయవాడ అంతా చల్లగా మారిపోయిందని చెవిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పైన ఉండే తండ్రి దీవెనలు, భగవంతుడి దేవెనలు, ప్రజల ఆశీస్సులు జగన్ కు ఉన్నాయని వ్యాఖ్యానించారు.

More Telugu News