Sanath Jayasurya: తాను నిక్షేపంగానే ఉన్నానన్న సనత్ జయసూర్య!

  • జయసూర్య చనిపోయాదంటూ వార్త వైరల్ 
  • ఈ వార్తపై ఆరా తీసిన రవిచంద్రన్ అశ్విన్ 
  • చివరికి స్పందించిన జయసూర్య 

సామాజిక మాధ్యమాల వల్ల మంచి ఎంత జరుగుతోందో, చెడు కూడా అంతే జరుగుతోంది. ప్రముఖులు చనిపోయారంటూ ఫేక్ న్యూస్ సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేసిన ఘటనలు గతంలో చాలానే చూశాం. తాజాగా శ్రీలంక క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సనత్ జయసూర్య కెనడాలో జరిగిన కారు ప్రమాదంలో చనిపోయాడంటూ ఓ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ న్యూస్ వాట్సాప్ ద్వారా టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కి చేరింది. అయితే రవిచంద్రన్ తొందరపడకుండా ఆ వార్తలోని నిజానిజాలను వెలికితీశాడు.

ఈ మేరకు అశ్విన్ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. ‘సనత్ జయసూర్య గురించి వచ్చిన వార్త నిజమేనా? అది వాట్సాప్ ద్వారా నాకు తెలిసింది. అయితే ట్విట్టర్‌లో ఎక్కడా ఆ ప్రస్తావన కనిపించలేదు’ అని ఆరా తీశాడు. దీనికి అశ్విన్ ఫాలోవర్లు ఆ వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పారు. మరోపక్క, తాను చనిపోయానంటూ వస్తున్న వార్తలపై జయసూర్య కూడా స్పందించాడు. తాను బాగానే ఉన్నానని, తనకేం కాలేదని, ఇలాంటి తప్పుడు వార్తలతో తన కుటుంబ సభ్యులను బాధ పెట్టవద్దని కోరాడు.

More Telugu News