Talasani: సికింద్రాబాద్ లో ఓటమికి అధైర్యపడొద్దు... కార్యకర్తలను ఓదార్చిన తలసాని

  • తన నివాసంలో సమావేశం ఏర్పాటు చేసిన తలసాని
  • కార్యకర్తలకు కర్తవ్యబోధ
  • సమస్యలను తన దృష్టికి తీసుకురావాలంటూ సూచన

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు సాయికిరణ్ లోక్ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమిపాలైన సంగతి తెలిసిందే. సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి విజయం సాధించారు. ఈ నేపథ్యంలో, తలసాని శ్రీనివాస్ యాదవ్ వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.

సికింద్రాబాద్ లో ఓటమి ప్రజా నిర్ణయం అని, దాన్ని గౌరవించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఓటమికి అధైర్యపడిపోకుండా, ప్రజా సమస్యలపై పోరాటమే పరమావధిగా ముందుకెళ్లాలని కార్యకర్తలకు కర్తవ్యబోధ చేశారు. సికింద్రాబాద్ పరిధిలోని డివిజన్లు, బస్తీల్లోని సమస్యలను గుర్తించి తనకు నివేదించాలని తలసాని ఈ సందర్భంగా కార్యకర్తలకు సూచించారు. అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగిపోవాలని, రాజకీయాల్లో గెలుపోటములు సహజం అని కార్యకర్తలను ఓదార్చారు.

More Telugu News