Vijayawada: దేవినేని ఉమ, నానిల బీపీ చెక్ చేసిన మీడియా!

  • ఈ నెల 23న ఏపీ ఎన్నికల ఫలితాలు
  • ఆయా పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్
  • గెలుపుపై ధీమాతో ఉన్న నేతల బీపీ చెక్ చేసిన మీడియా 

ఈ నెల 23న ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల తరపున బరిలో నిలిచిన నేతల్లో ఎవరు గెలుస్తారో, ఎవరు ఓటమి పాలవుతారోనన్న దానిపై నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల బీపీ లెవెల్స్ అమాంతం పెరిగిపోతాయేమోనని భావించే పరిస్థితులు నెలకొన్నాయి.

ఇలాంటి తరుణంలో విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నానిని టీవీ9 మీడియా కలిసింది. గెలుపుపై ధీమాతో ఉన్న కేశినేని నాని బీపీ లెవెల్స్ ఎలా ఉన్నాయో ఆరా తీసింది. బీపీ మిషన్ తో చెక్ చేసింది. ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ఉన్న నాని బీపీ నార్మల్ గానే ఉంది. అదే విధంగా, తన గెలుపుపై ధీమాతో ఉన్న మైలవరం టీడీపీ అభ్యర్థి దేవినేని ఉమ బీపీ లెవెల్స్ చెక్ చేయగా నార్మల్ గానే ఉన్నాయి.

ఈ సందర్భంగా కేశినేని నాని మాట్లాడుతూ, విజయవాడ చరిత్రలో ఎప్పుడూ రానటువంటి, కనీవినీ ఎరుగని మెజార్టీతో, తాను విజయం సాధించబోతున్నానని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఐదేళ్ల కాలాన్ని ఒక్క నిమిషం కూడా వృథా కానీయకుండా ప్రజల కోసం, ఈ ప్రాంతం అభివృద్ధి కోసం కష్టపడ్డానని చెప్పారు.

More Telugu News