Nellore District: లారీ డ్రైవర్లే ఆమె టార్గెట్... అందాన్ని ఎరగావేసే కి'లేడీ' సహా నలుగురి అరెస్ట్!

  • నెల్లూరు జిల్లాలో సాగుతున్న దందా
  • ముగ్గురితో కలిసి యువతి మోసాలు
  • ఫిర్యాదులపై స్పందించిన పోలీసులు

రాత్రి ఎనిమిది దాటితే, అందంగా తయారై, హైవేపైకి టార్చ్ లైట్ తో వెళ్లి, లారీ డ్రైవర్లను ఆకర్షించి, ఆపై వారిని అడ్డంగా దోచుకుంటుందా యువతి. ఆమెకు మరో ముగ్గురు సహకరిస్తారు. నెల్లూరు నగర డీఎస్పీ మురళీకృష్ణ వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, ఆమంచర్ల గ్రామానికి చెందిన మల్లి శ్రీనివాసులు, వీరేశం, మట్యంపాటి అనిల్‌ స్నేహితులు. వీరు ఆటో నడుపుతూ ఉంటారు.

వీరిలో అనిల్ కు రమాదేవి అనే యువతితో వివాహేతర సంబంధం ఉంది. ఆటోలు నడిపితే వచ్చే డబ్బులు సరిపోవడం లేదని ప్లాన్ వేసిన ఈ బృందం, డబ్బు సంపాదనకు రమాదేవిని వాడుకోవాలని నిర్ణయించారు. ఈ క్రమంలో రమాదేవిని అందంగా మేకప్ చేయించి, ఆటోలో హైవేపైకి తీసుకెళ్లి రోడ్డుపై నిలబెడతారు. అనంతరం ముగ్గురు స్నేహితులూ చీకట్లో తమ ఆటోను నిలిపి నక్కుతారు.

ఎవరైనా రమాదేవిని చూసి ఆకర్షితులై, లారీని ఆపితే, అతన్ని పక్కకు వెళ్దామని చెప్పి చీకట్లోకి తీసుకొస్తుంది. ఆపై అందరూ కలిసి దాడి చేసి, అతని వద్ద ఉండే నగలు, నగదు లాగేసుకుని, ఆటోలో పారిపోతారు. ఖమ్మం జిల్లాకు చెందిన బత్తల శివాజీ అనే డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, నిఘా పెట్టి, సుందరయ్య కాలనీ దాటిన తరువాతి నిర్జన ప్రదేశంలో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

More Telugu News