Rajasthan: చిరిగిన దుస్తుల్లో పోలీస్ స్టేషన్‌కు వెళుతున్న మహిళను ఫోటోలు, వీడియోలు తీసిన స్థానికులు!

  • ఉపాధి నిమిత్తం వెళ్లిన బాధితురాలి భర్త
  • చిత్ర హింసలకు గురి చేసిన అత్త, ఆడబిడ్డ
  • మహిళను తీవ్రంగా కొట్టి వస్త్రాలు చింపేశారు

అత్తింట చిత్ర హింసలకు గురై.. ఒంటిమీద బట్టలు చిరిగిపోయిన స్థితిలో పోలీస్ స్టేషన్‌కు వెళుతున్న మహిళను ఫోటోలు, వీడియోలు తీస్తూ కొందరు రాక్షసానందం పొందిన ఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మహారాష్ట్రలోని అకోలా ప్రాంతానికి చెందిన మహిళకు రాజస్థాన్‌లోని చురు జిల్లాకు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. ఉపాధి నిమిత్తం ఆమె భర్త అస్సాంకు వెళ్లగా, ఇంట్లో అత్త, ఆడపడుచు కలసి ఆమెను చిత్రహింసలకు గురి చేశారు.

తాజాగా ఇద్దరూ కలిసి మహిళను తీవ్రంగా కొట్టి, ఆమె దుస్తుల్ని చింపేశారు. దీంతో బాధితురాలు అదే స్థితిలో పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి అత్తింటి ఆరళ్లపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహిళ అత్తింటి వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే బాధిత మహిళ పోలీస్ స్టేషన్‌కు వచ్చే దారిలో ఆమెకు అండగా నిలవాల్సింది పోయి, అక్కడి స్థానికులు కొందరు సెల్‌ఫోన్లతో ఆమెను ఫోటోలు, వీడియోలు తీస్తూ ఆమెను మరింత క్షోభకు గురిచేశారు. 

More Telugu News